హోదా ఎఫెక్ట్: మండలిలో సోము వీర్రాజు వర్సెస్ రాజేంద్ర ప్రసాద్
అమరావతి: శాసన మండలిలో సోమవారం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఇరువురు నేతల మధ్య వాగ్యుద్ధం నడిచింది.
విభజన హామీలను కేంద్రం విస్మరించిందని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. సోము వీర్రాజు కల్పించుకొని టీడీపీ ఈ నాలుగేళ్లలో పలుమార్లు మాటలు మార్చిందని, వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం ప్రభుత్వ వ్యతిరేకతను కేంద్రం పైకి నెడుతోందన్నారు.
చంద్రబాబు లేఖ రాయడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని, టీడీపీ ఏపీలో సమైక్య ఉద్యమం, తెలంగాణలో విభజన ఉద్యమం నడిపిందన్నారు. విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడింది బీజేపీనే అని, కేంద్ర సాయంపై ఆ పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
దీనికి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఏపీపై వివక్ష చూపుతోందన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అని కేవలం వెయ్యి కోట్లు నిధులిచ్చారని, 2016లో నిధులు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తూ దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.