CM Ramesh: ప్రధానితో సీఎం రమేష్ సమావేశం: కుటుంబంతో సహా.. !
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రధానిని కలిశారు. తన కుమారుడు రిత్విక్ వివాహ ఆహ్వాన పత్రికను సీఎం రమేష్ మోడీకి అందజేశారు. వివాహానికి హాజరు కావాలని కోరారు. సీఎం రమేష్ భార్య, ఇద్దరు కుమారులతో మోడీని కలిశారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో రిత్విక్ నిశ్చితార్థం కొద్దిరోజుల కిందటే దుబాయ్లో నిర్వహించారు.
సుమారు 75 కోట్ల రూపాయలను ఈ నిశ్చితార్థం కోసం ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. 75 మందికి పైగా లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు. వారి కోసం సీఎం రమేష్ 15 స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లను ఏర్పాటు చేశారు. తాజాగా వచ్చే నెలలో రిత్విక్, పూజ వివాహం జరుగనుంది. నిశ్చితార్థం కంటే ఆడంబరంగా వివాహ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సీఎం రమేష్ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను పెళ్లికి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రిత్విక, పూజ వివాహానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.