బాబు గ్రేట్ లీడర్ కానీ: బీజేపీ ఎంపీ, 'ఏపీలో టీడీపీ-వైసీపీ ప్రభుత్వం.. మాట్లాడరేం'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏపీ వరకు గొప్ప నేత అని భారతీయ జనతా పార్టీ ఎంపీ గోకరాజు రంగరాజు ఆదివారం అన్నారు. కానీ దేశానికి, ప్రపంచానికి గొప్ప నేత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
జాతీయ నేత కావాలంటే చంద్రబాబు తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చామని చంద్రబాబు పలుమార్లు చెప్పారని, అదే సమయంలో 2014 నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
గొంతు పిసికిన బాబుకు చుక్కలు చూపిస్తా, వారికి సాయం చేస్తా: మోత్కుపల్లి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాది హామీ నిధులు లేకుండా గ్రామాల్లో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కేంద్రం నుంచి సాయాన్ని పొంది, దానిని మర్చిపోతే విశ్వాసఘాతుకం అంటారని విమర్శించారు. అన్ని విషయాలకు కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఏపీలో జగన్-చంద్రబాబు ప్రభుత్వం.. దీనిపై ఎవరూ మాట్లాడట్లేదు
హోదా పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ వేరుగా అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేటలో నిర్మించనున్న ఏపీ బీజేపీ కార్యాలయ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ నెల 16న కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తారన్నారు.
అయిదు అంతస్తుల్లో నిర్మించే భవనాన్ని ఏడాది లోపు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై ఎవరూ మాట్లాడటం లేదన్నారు. రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు.
నాడు మాదిగలు, నేడు కాపులను మోసం చేస్తున్న బాబు
గతంలో మాదిగలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు కాపులను కూడా మోసం చేస్తున్నారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా అన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను అటకెక్కించి మాదిగలకు తీరని అన్యాయం చేసింది చంద్రబాబే అన్నారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని చెప్పిన చంద్రబాబు, దానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయించలేదన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేయడం చేతకాని చంద్రబాబు కాపులకు ఒరగబెట్టేది ఏముంటుందని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు ఏ పని చేసినా కేవలం ఓట్లు, సీట్లు కోసమే చేస్తారన్నారు. రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అంతరించిపోతుందన్నారు.