ఆంధ్రా విజయ్ మాల్యాలుగా మారిన టిడిపి ఎంపీలు...మోడీపై చంద్రబాబు, కేసీఆర్ కుట్ర:జివిఎల్
హైదరాబాద్:టిడిపి ఎంపి సుజనా చౌదరి అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ నోటీసుల జారీపై బిజెపి అధికార ప్రతినిథి, ఆ పార్టీ ఎంపి జివిఎల్ నరసింహారావు స్పందించారు. టిడిపి ఎంపీలు ఆంధ్రా విజయ్ మాల్యాలుగా మారారని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ లో బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపి జీవీఎల్ మాట్లాడారు. సుజనా చౌదరి అధికారం ముసుగులో వేల కోట్లు కొల్లగొట్టారని జివిఎల్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇలా దోచుకున్న సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో తల్లీ-కొడుకుల రాజ్యం నడుస్తుంటే, టీడీపీలో తండ్రీకొడుకుల రాజ్యం నడుస్తోందని జివిఎల్ వ్యంగాస్త్రాలు సంధించారు.
అసలు ఆ కుట్ర...చేసిందే కాంగ్రెస్
అసలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకుండా కుట్ర చేసిందే కాంగ్రెస్ పార్టీ అని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై 2013లో అప్పటి రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని జివిఎల్ గుర్తుచేశారు. అయితే కొన్ని రాష్ట్రాలకే ప్రత్యేకహోదా ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని రఘురాం రాజన్ సెప్టెంబర్ 23న నివేదిక ఇచ్చారని వెల్లడించారు. దీంతో ఎపికి ప్రత్యేకహోదా డిమాండ్ ను నిర్వీర్యం చేసే కుట్రకు కాంగ్రెస్ తెరతీసిందని జివిఎల్ ఆరోపించారు.
ఆంధ్రులను మోసగించే...దొంగనాటకం
అలా చేసిందే కాక ఇప్పుడు ఆంధ్రులను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైందని...అలాంటి పార్టీతో టిడిపితో చేతులు కలుపుతోందని జివిఎల్ ధ్వజమెత్తారు. రఘురాంరాజన్ ద్వారా ఎపి ప్రత్యేక హోదాకు శఠగోపం పెట్టించిన కాంగ్రెస్...ఆంధ్రులను మోసం చేస్తూ దొంగనాటకం ఆడుతోందన్నారు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి?...దానివల్ల ఏయే ప్రయోజనాలు చేకూరుస్తారు?...అనే విషయాలపై రాహుల్ ఈ నెల 28న జరిగే ఖమ్మం బహిరంగ సభలో స్పష్టత ఇవ్వాలని ఎంపి జివిఎల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా...ఎలా సాధ్యం?
ఇదిలావుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని అటు కర్ణాటక ప్రభుత్వంతో పాటు...కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా వ్యతిరేకిస్తున్నారని జీవీఎల్ వెల్లడించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఎలా సాధ్యమవుతుందని జివిఎల్ నిలదీశారు. మరోవైపు ఎపికి కేంద్రం ఎంతో ఆర్థిక సాయం చేసిందనీ, ఇలా చేయాలని పునర్విభజన చట్టంలో లేకపోయినా రాష్ట్రాన్ని ఆదుకునేందుకే చేసిందని జీవీఎల్ చెప్పుకొచ్చారు.
మోడీపై...చంద్రబాబు,కెసిఆర్ కుట్ర
ప్రధాని మోదీని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు, కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఎంపి జివిఎల్ ఆరోపించారు. సోనియా, రాహుల్ పట్ల కేసీఆర్ కు చాలా ప్రేమా, ఆప్యాయతలు ఉన్నాయన్నారు. అందుకే కాంగ్రెస్ చేసిన అవినీతిపై కెసిఆర్ ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విశ్లేషించారు. అంతేకాదు తెలంగాణ ఎన్నికల వేళ సోనియాగాంధీ, కేసీఆర్ పరస్పరం పల్లెత్తు మాట కూడా అనుకోవడం లేదని...ఆ రాష్ట్రంలో ఇప్పుడు జగన్నాటకం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం...కేసీఆర్, చంద్రబాబు ఒక్కటై పోతారని జివిఎల్ జోస్యం చెప్పారు.