షేర్ మార్కెట్ బ్రోకర్ సమాధానం చెప్పడమేంటి?...కుటుంబరావుకు బిజెపి ఎంపి జివిఎల్ కౌంటర్
విజయవాడ:టిడిపి, బిజెపి నేతల మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలు పతాక స్థాయికి చేరాయి. అవినీతి విషయమై ఒకరు తారా స్థాయిలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. చివరకు ఇవి వ్యక్తిగతంగా దూషించే స్థాయివరకు వెళ్లిపోతున్నాయి.
తాజాగా బిజెపి ఎంపి జివిఎల్ టిడిపి ప్రభుత్వం అవినీతిపై చేసిన విమర్శలకు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఘాటుగా సమాధానం చెప్పారు. అయితే దీనిపై మళ్లీ ప్రతిస్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కుటుంబరావు విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కుటుంరావు ఒక షేర్ మార్కెట్ బ్రోకర్ అని...తనకు ఆయన సమాధానం చెప్పడమేంటని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు.
తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పుకునే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పీడీ స్కాంపై సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిలదీశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.53 వేల కోట్లను పర్సనల్ అకౌంట్స్లో వేశారని, పీడీ స్కాం విషయమై తన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కామన్వెల్త్ , 2జీ స్కాంల కంటే పీడీ కుంభకోణం పెద్దదని బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కంటే హీనంగా దిగజారారని జీవీఎల్ దుయ్యబట్టారు.
పిడి స్కాం అంటూ టిడిపి ప్రభుత్వంపై విమర్శలు చేసిన జీవీఎల్ నరసింహారావుపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వంపై జీవీఎల్ చేసిన ఆరోపణలన్నీఅవాస్తమని కొట్టిపారేశారు. ఆయన కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. జీవీఎల్కు దమ్ముంటే ఏపీలో కనీసం వార్డు మెంబర్గా అయినా గెలవాలని కుటుంబరావు ఛాలెంజ్ చేశారు.
పీడీ అకౌంట్లో రూ.20 వేల కోట్లు మురిగిపోతున్నాయంటూ...జీవీఎల్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. నిధులే ఉంటే రాష్ట్రం ఎందుకు అప్పులు చేస్తుందని కుటుంబరావు ప్రశ్నించారు.
మరోవైపు ఎంపి కేశానేని నాని కూడా జివిఎల్ ఆరోపణలపై విమర్శల వర్షం కురిపించారు. జివిఎల్ నరసింహారావు కి ఏపీలో అసలు అడ్రెస్ లేదని...
ఆయన అడ్రెస్ ఒకచోట...ఆయన మాట్లాడేది మరోచోటని ఎద్దేవా చేశారు. జివిఎల్ నరసింహారావు కి ఆధార్ కార్డ్ , పాస్ పోర్ట్ ఎక్కడ ఉందో ఆయనకే తెలియదన్నారు.
జివిఎల్ నరసింహారావు లాంటి వాడు ఏపీకి వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
గతంలో పార్లమెంట్ దగ్గర మోడీ క్యాండిల్ ర్యాలీ చేసినప్పుడు పార్లమెంట్ కి ముప్పు వస్తుందని కనిపించలేదా...
ఇప్పుడు ఏపీకి హోదాకోసం పోరాటం చేస్తుంటే పార్లమెంట్ కి ముప్పు వస్తుందని జివిఎల్ నరసింహారావు అనడం దారుణమన్నారు.
ఏపీలో లక్ష కోట్ల అవినీతి అంటుంన్న జివిఎల్ నరసింహారావు వెయ్యి రూపాయల అవినీతి జరిగిందేమో నిరూపించాలని కేశినేని నాని సవాలు విసిరారు.