ప్రభుత్వం రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణం...మీ ప్రతిపనిపైనా నిఘా ఉంటుంది:బిజెపి ఎంపి జీవీఎల్
విశాఖపట్నం:ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి కోసం రుణాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా జరగడం లేదని రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఎపిలో నిధులను దుర్వినియోగం చేస్తూ కేవలం తాత్కాలిక గృహాలకే పరిమితం అవుతున్నారని జివిఎల్ ఆరోపించారు. ప్రభుత్వం ఇలా రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకం నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఎంపి జివిఎల్ ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే లెక్కలు చెప్పేందుకు టిడిపి ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో వెయ్యి ఖర్చు అయ్యే చోట పదివేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని జివిఎల్ ధ్వజమెత్తారు. ఈ విధంగా డబ్బును పార్టీ ఫండ్లోకి మారుస్తున్నారని ఎంపి జివిఎల్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వీటిని గమనిస్తున్నారని...ఇందుకు మీకు తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని జివిఎల్ వ్యాఖ్యానించారు. మీరు చేసే ప్రతిపనిపైనా జాతీయ స్థాయిలో మా నిఘా కూడా ఉంటుందని ఎంపి జివిఎల్ హెచ్చరించారు.
మరోవైపు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి చితాభస్మ కలశ యాత్ర సోమవారం కాకినాడ చేరుకుందని బీజేపీ సిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్ వెల్లడించారు. మాజీ ప్రధాని, దివంగత భాజపా నేత వాజ్ పేయి అస్తికలను దేశవ్యాప్తంగా ఉన్న వంద పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తున్న సంగతి తెలిసిందే . ఆ ఘట్టంలో భాగంగా ఆయన చితాభస్మ కలశ యాత్ర కాకినాడకు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అన్నమ్మఘాటీ సెంటర్కు చేరుకుంది.
అనంతరం దేవాలయం వీధి మీదుగా బాలాజీ చెరువు సెంటర్కు చేరుకొని...మధ్యాహ్నం 3.30 గంటలకు నూకాలమ్మగుడి సెంటర్ మీదుగా భానుగుడి సెంటర్కు చేరుకోనుంది. ఆ తర్వాత నాగమల్లితోట జంక్షన్ మీదుగా సర్పవరం సెంటర్కు చేరుతుందని పెద్దిరెడ్డి రవికిరణ్ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతోన్న దివంగత ఈ మహనీయుడి చితాభస్మ కలశయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు.