పవనూ! మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయవు? టీడీపీలో రాజకీయ బ్రోకర్లు!
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం-జనసేన పార్టీ తోడుదొంగలని ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీని గానీ, చంద్రబాబు నాయుడిని గానీ పవన్ కల్యాణ్ ఏనాడైనా విమర్శించారా? అని ఆయన నిలదీశారు. పోలింగ్ గడువు సమీపిస్తుంటే.. ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఎందుకు ప్రచారానికి వెళ్లట్లేదని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్గా మారిపోయారని ఆరోపించారు. పవన్.. పెద బాబునే కాదు చిన బాబును కూడా పల్లెత్తు మాట అనడం లేదని అన్నారు.
రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంట్రీకి ఆ స్థానమే ఎందుకు?
మంగళగిరికి ఎందుకెళ్లవ్?
ప్యాకేజీలో భాగంగానే పవన్ మంగళగిరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ మంగళగిరిలో పర్యటించినప్పటికీ.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. మంగళగిరికి వెళ్లి పవన్ కల్యాణ్ చంద్రబాబును గానీ, అక్కడ పోటీ చేస్తోన్న ఆయన కుమారుడిని గానీ విమర్శించరని ఎద్దేవా చేశారు. పవన్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా బాగా నటిస్తున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అందుకే పవన్ ఇలాంటి నాటకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. అది ఆయనకే మంచిదని హితవు పలికారు.
బీజేపీకి 300 సీట్లు వస్తాయని జీవీఎల్ జోస్యం చెప్పారు.
దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మోడీ ఎన్డీఏ ఒకవైపు..మిగిలిన పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయని అన్నారు. భంగపడి, వైఫల్యం చెందిన పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయాయి. బీజేపీకి సొంతంగా 300లకు పైగా సీట్లు రావడం ఖాయమని జీవీఎల్ అన్నారు. ఎన్డీఏ కూటమికి గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ, మమతా వంటి వారికి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే బీజేపీ, మోడీపై వ్యక్తిగత విమర్శ లు చేస్తున్నారని జీవీఎల్ అన్నారు. అమేథీలో ఓడిపోతాననే భయంతోనే రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని అన్నారు.
స్టిక్కర్ల చంద్రబాబు..
చంద్రబాబును ప్రజలు పట్టించుకోకపోవడంతో జాతీయ నేతలను తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. గంటల పాటు ప్రసంగించి, బోరు కొట్టించే చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఒక్కసారైనా ఏపీకి ఏంచేశారో చెప్పట్లేదని అన్నారు. కేంద్ర పథకాలను బాబు తన పథకాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. కియా వ్యవహారంలో అన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తే.. తానే తెచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబు చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెబుతూ, ప్రజలకు విసుగెత్తిస్తున్నారని అన్నారు. స్టిక్కర్ బాబుగా పేరు గాంచిన చంద్రబాబు కేంద్రం పధకాలను తనవిగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రకటనలు చూస్తే చాలా గొప్పగా ఉన్నాయని, వాటి వెనుక అమలు మాత్రం అంతా డొల్లే అని చెప్పారు. కేంద్రం పేదలకు ఇళ్లు ఇస్తే.. తన గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు జీవీఎల్. టీడీపీలో కొంతమంది రాజకీయ బ్రోకర్లు ఉన్నారని, వారంతా నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని జీవీఎల్ ఆరోపించారు.