ఎయిర్ఏషియా.. భయంతో ఫోన్ ట్యాపింగ్, మీకెందుకు భయం, అది కూడా విచారిస్తారు!: జీవీఎల్
అమరావతి: ఎయిర్ ఏషియా కుంభకోణం వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు తెలుగుదేశం ప్రభుత్వం, కుటుంబ రావుపై బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో ఫోన్ సంభాషణలు వెలుగులోకి వస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశాన్ని రాజకీయంగా తాము లేవనెత్తలేదన్నారు. అవినీతి, అక్రమాల్లో ఏపీ ప్రభుత్వం నంబర్ వన్గా ఉందన్నారు.
ఎయిర్ఏషియా ఎఫెక్ట్, గుర్తుపెట్టుకోండి.. ప్రకంపనలు సృష్టించే స్కాం బయటపెడ్తాం: కేంద్రంపై సంచలనం
Recommended Video
చాలా రాష్ట్రాల్లో బీజేపీని తక్కువగా అంచనా వేసిన పార్టీలు ఇప్పుడు తుడుచుపెట్టుకుపోయాయన్నారు. ఏపీలోను అదే పరిస్థితి వస్తుందన్నారు. టీడీపీ నేతలు చేసే ఆరోపణలను తాము పట్టించుకోమని, రాష్ట్రంలో తమ పార్టీ అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఎయిర్ ఏషియా స్కాం విషయంలో తాము ఏమాత్రం మాట్లాడకున్నా గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నట్లుగా టీడీపీ వారు వారంతట వారే ముందుకు వచ్చారని ఎద్దేవా చేశారు.
చవకబారు ప్రగల్భాలు
ఈ అవినీతితో తమకు సంబంధం లేదనే ప్రకటన చేశారని జీవీఎల్ అన్నారు. పైగా కేంద్రం విషయంలో తాము సంచలన అవినీతి బయటపెడతామని చవకబారు ప్రగల్భాలు పలికారని, వాటిని మేం పట్టించుకోమన్నారు. చవకబారు వ్యాఖ్యలకు మేం ప్రాధాన్యత ఇవ్వమన్నారు. ఎందుకంటే మా పార్టీకి, మోడీకి ఉన్న విశ్వసనీయత అలాంటిదన్నారు. మీలా (టీడీపీ) షేర్ మార్కెట్ లావాదేవీలు మాకు ఉండవన్నారు. అక్రమ వ్యాపారాలు ఉండవన్నారు. మీ చిల్లర వ్యాఖ్యలను మేం పెద్దగా పట్టించుకోమన్నారు.
వారి మధ్య సంభాషణ బయటకొస్తే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు
ఎయిర్ ఏషియా స్కాం వ్యవహారంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాఫ్తు చేస్తోందని జీవీఎల్ చెప్పారు. ఈడీ కూడా దర్యాఫ్తు చేస్తోందన్నారు. ఇందులో ఎయిర్ ఏసియా కంపెనీ సీఈవో, ఇండియా సీఈవో మధ్య జరిగిన సంభాషణ అని చెప్పారు. ఇందుకు సంబంధించి పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. వాటి ఆధారంగా నేను చెబుతున్నానని తెలిపారు. ఈ వ్యవహారంలో సింగపూర్కు చెందిన ఓ కంపెనీకి పెద్ద ఎత్తున ముడుపులు అందాయని తేలిందన్నారు. కొన్ని అరెస్టులు కూడా జరిగాయన్నారు. ఢిల్లీలో ఏదో దర్యాఫ్తు జరుగుతుంటే ఇక్కడ మీరు ఎందుకు భయంతో వణుకుతున్నారని ప్రశ్నించారు. మీరు ఇక్కడ ఎందుకు కంపిస్తున్నారని, అవాకులు చవాకులు పేలుతున్నారని ప్రశ్నించారు.
తప్పు చేసిన వాడే భయపడతాడు
మా వద్ద కూడా ఏదో ఉందని మేం ఏదో చేస్తామని ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎక్కడో భయాందోళన ఉందన్నారు. తప్పు చేసినవాడే భయపడతాడని, తప్పు చేయని వాడు భయపడడని చెప్పారు. గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్లుగా ప్రభుత్వంలోని నాయకుల తీరు ఉందన్నారు. మీరు గట్టిగా మీడియాకు ఎక్కితే ఇతరులు భయపడి వణికిపోతారని భావించడం, ఎండాకాలంలో చలితో కంపించుపోవడం మీకే సాటి అన్నారు. మేం ఎప్పుడు తప్పులు చేయలేదు, చేయమన్నారు. కాబట్టి మీ ప్రగల్భాలు పట్టించుకోదల్చుకోలేదన్నారు.
ట్యాపింగ్కు అనుమతి ఉందా అన్న వ్యాఖ్యలకు కౌంటర్
ట్యాపింగ్కు ఈ దేశంలో అనుమతి ఉందా అన్న కుటుంబ రావు వ్యాఖ్యలకు దిమ్మతిరిగే షాకిచ్చారు జీవీఎల్. మా రాష్ట్ర నాయకులైన కన్నా లక్ష్మీనారాయణ విషయంలో మీరు ఇల్లీగల్ ట్యాపింగ్ చేశారని కౌంటర్ ఇచ్చారు. అసలు అక్రమ ట్యాపింగ్ మీ ప్రభుత్వమే చేస్తుందన్నారు. అయినా ఎవరో ఫోన్ ట్యాపింగ్ చేస్తే, ఎవరో మాట్లాడుకున్న సంభాషణ బయటకు వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలకు ఎలాంటి అధికారాలు, కేసుల విచారణలో ఎలాంటి అనుమతులు ఉంటాయనేది మరో అంశమన్నారు. అది చట్టబద్దమైన అంశమన్నారు. ఎవరిదో ఫోన్ ట్యాప్ అయితే మీరు ఎందుకు భయపడుతున్నారన్నారు. మీరు భుజాలు తడుముకోవడం ఏమిటన్నారు.
అది కూడా విచారణలో భాగమయ్యే అవకాశం
మీడియాలో వచ్చిన ఎయిర్ ఏషియా అధికారుల సంభాషణ గురించి జీవీఎల్ మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్లో ఇది కూడా ఓ భాగమయ్యే ఆస్కారం ఉందన్నారు. సింగపూర్ కంపెనీకి ఎలా ముడుపులు అందాయి, దాని అసలు లబ్ధిదారు ఎవరో మనకు తెలియదని, అది విచారణలో తేలుతుందన్నారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలు రాకుండా దానికి సంబంధించిన వారు స్పందిస్తారన్నారు. ఈ అంశాన్ని మా అంతట మేం లేవనెత్తలేదన్నారు. పలువురు మీడియా ప్రతినిధులు తనను దీని గురించి అడిగితే, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతానని చెప్పానని తెలిపారు. కుటుంబ రావు ముందుకు వచ్చారు కాబట్టి ప్రస్తావన వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భయంతో ఫోన్ ట్యాపింగ్
వారు తమకు ఏ రివార్డు ఇచ్చినా, తిట్లు తిట్టినా మా పైన ఎలాంటి ప్రభావం పడదని జీవీఎల్ అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తే మేం స్పందిస్తామని ఎవరైనా అనుకుంటున్నారేమో కానీ, స్పందించమని చెప్పారు. తాను అన్నింటిని ఆధారంగా చెప్పానని తెలిపారు. నేను అవాస్తవాలు ప్రస్తావించలేదన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలామంది ఫోన్లను వింటుందని భావిస్తున్నామని, చాలా అభద్రతా భావంతో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. ఏపీలో అనేక మంది ఫోన్లు ట్యాపింగ్లో ఉంటాయని భావిస్తున్నామన్నారు. అయితే మనం వాస్తవాలు మాట్లాడుతాం కాబట్టి భయం లేదన్నారు.
నేను ఆ ప్రస్తావనే తీసుకురాలేదు
ఎయిర్ఏషియా విషయమై తాను అసలు ప్రస్తావనే తీసుకు రాలేదని జీవీఎల్ చెప్పారు. కుటుంబరావు మాట్లాడిన తర్వాతే తాను స్పందించానని అన్నారు. కేంద్రంలోని కుంభకోణాలతో ప్రకంపనలు సృష్టిస్తామని కుటుంబ రావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దానికి ముహూర్తం ఎందుకని, నెల రోజుల సమయం ఎందుకని ప్రశ్నించారు. ఆరోపణల్లో ఇరుక్కుపోయే వారు చేసే పని అన్నారు. ఓ పక్క మేం వణికిపోతున్నామని రాష్ట్ర నాయకులు అంటున్నారు, మరో పక్క ప్రకంపనలు అంటున్నారన్నారు. ఎయిర్ఏషియా వ్యవహం దర్యాఫ్తు సంస్థల పరిధిలో ఉందని చెప్పారు.