దిగజారి మాట్లాడుతున్న చంద్రబాబు...అన్నీ అబద్దాలే:బిజెపి ఎంపి జివిఎల్
విజయవాడ:రాష్ట్రంలో కొద్ది నెలలుగా ఒక ప్లాన్ ప్రకారం బిజెపిపై దుష్ప్రచారం జరుగుతోందని బిజెపి రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు ఆరోపించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు.ఎపిలో స్వయంగా ముఖ్యమంత్రే ఇలా అవాస్తవాలను చెబుతుండటం దారుణమని జివిఎల్ వ్యాఖ్యానించారు. సర్థార్ వల్లభాయ్ పటేల్ ప్రాజెక్ట్ కోసం కేంద్రం మూడు వేల కోట్లు ఇచ్చిందని చంద్రబాబు ఇటీవలే ఓ అబద్దాన్ని ప్రకటించారని...కానీ ఇది పచ్చి అబద్దమని జివిఎల్ చెప్పారు. "
రాజకీయం కోసం ఓ సిఎం ఇంత దిగజారి మాట్లాడతారా?...ఆ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇచ్చింది కేవలం మూడు వందల కోట్లు మాత్రమే...ఇలాంటి అబద్దాలు ఎన్ని చెబుతారు"...అని జివిఎల్ ధ్వజమెత్తారు.దొలేరా ప్రాజెక్ట్ కు కేంద్రం 98 వేల కోట్లు ఇచ్చిందని చంద్రబాబు మహానాడు సాక్షిగా చెప్పారని...అసలుఆ ప్రాజెక్ట్ మొత్తం విలువే 1400 కోట్లు దాటదన్నారు. అబద్దాలు చెప్పడం, అవాస్తవాలు మాట్లాడటం సిఎం స్థాయి కి తగదని హితవుపలికారు.
ప్రత్యర్థులపై బురదజల్లి...పారిపోయే విధానాలు చంద్రబాబుకు సరికాదన్నారు. 2009లో దొలేరా ను ప్రత్యేక ఇండస్ట్రియల్ జోన్ గా నిర్మాణ ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు.దేశంలోని ఎనిమిది ఇండస్ట్రియల్ జోన్లలో దొలేరా ఒకటని...2500 నుంచి 3 వేల కోట్ల వరకే ఈ జోన్లకు కేంద్రం కేటాయిస్తుందని జివిఎల్ వెల్లడించారు. ఆ క్రమంలో రూ. 1293 కోట్లు మాత్రమే కేంద్రం దొలేరాకు ఇచ్చిందని...మరి సిఎం చంద్రబాబుకు 98 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బిజెపి ఎంపి జివిఎల్ నరసింహరావు ప్రశ్నించారు.