టిడిపిని కాంగ్రెస్ కు స్టెప్నీగా మార్చిన చంద్రబాబు:బీజేపీ ఎంపీ సంచలనం
విజయవాడ:బిజెపి రాజ్యసభ ఎంపి జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీకి స్టెప్నీగా మారారన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీని ఇకపై తెలుగు కాంగ్రెస్ అనాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు.
గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు టిడిపి ప్రభుత్వంపై,చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు...కాంగ్రెస్ పార్టీతో కలసితో జత కలిసి పార్లమెంట్ సమావేశాలను సరిగా జరగనివ్వకుండా అడ్డుపడ్డారన్నారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో టిడిపి హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని...వాటిపై సమాధానం చెప్పకుండా ప్రత్యేక హోదా ముసుగులో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అయితే వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయని, ఎపికి కేంద్రం ఏమేం చేసిందో కూడా తేలుతుందని ఈ సందర్భంగా ఎంపి జివిఎల్ నరసింహారావు చెప్పడం గమనార్హం.