గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఎంపి జీవీఎల్;కాంగ్రెస్తో టీడీపీ పొత్తు సిగ్గుచేటు:పురంధేశ్వరి
విజయవాడ:ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిసి ఎపి ప్రభుత్వంపై, టిడిపి నేతలపై ఫిర్యాదు చేయడం రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
విశాఖ భూకుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరగలేదని గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసిన ఎంపి జివిఎల్ ...టిడిపి నేతలు వివిధ పథకాల్లో పాల్పడిన అవినీతి గురించి కూడా ఆయనకు వివరించారని తెలిసింది. గవర్నర్ తో భేటీ అనంతరం ఎంపి జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం పనితీరును దుయ్యబట్టారు.
ఏ ప్రభుత్వంలోనూనా ప్రజాప్రతినిధుల అనవసర ఖర్చులకు అధికారులే బాధ్యులవుతారని వ్యాఖ్యానించిన ఎంపి జీవిఎల్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం చాలా తప్పు అని హితవు పలికారు. ప్రభుత్వ సొమ్మును పార్టీలకు వెచ్చించడం నేరమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిన సొమ్మును కోర్టు ద్వారా కట్టిస్తామని జీవీఎల్ తేల్చిచెప్పారు.
మరోవైపు బిజెపి మహిళా నేత పురంధేశ్వరి కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడంలేదని టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ నేతలు జతకట్టడం సిగ్గుచేటని తప్పుబట్టారు. ప్రకటించిన విధంగా రాయలసీమ డిక్లరేషన్కు బీజేపీ కట్టుబడి ఉందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు.
ఎన్డియేకి వ్యతిరేకంగా జట్టుకడుతున్న కూటమికి ఒక లక్ష్యమంటూ లేదని పురంధేశ్వరి దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె పూర్తి ధీమాను వ్యక్తం చేశారు.