అధికారం కోసమే బాబు ఆరాటం, ఆ సంపాదనతోనే దీక్ష: జీవీఎల్ నరసింహరావు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు ధర్మపోరాటం చేయలేదని, అధికారం కోసం ఆరాట పడ్డారని ఆయన ఆరోపించారు.
సోమవారం నాడు జీవిఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ళలో ఏపీ రాష్ట్ర ప్రజలకు టిడిపి ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. పోలవరంలో అవినీతి, పట్టిసీమలో అక్రమాల సంపాదనతో దీక్ష చేస్తున్నారా అని జీవిఎల్ నరసింహరావు ప్రశ్నించారు.
కర్ణాటకలో కాంగ్రెస్తో టిడిపి కుమ్మక్కై బిజెపిపై కుట్రలు చేస్తోందన్నారు. టిడిపి పేరును తెలుగు కాంగ్రెస్ పార్టీగా మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా నరేంద్ర మోడీ ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడంతో టిడిపి ఆధ్వర్యంలో సోమవారం నాడు తిరుపతి వేదికగా ధర్మపోరాట దీక్ష పేరుతో సభను నిర్వహించారు.
ఈ సభలో బిజెపి నేతలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహ పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు స్పందించారు. చంద్రబాబు ఆరోపణలను ఖండించారు. ఏపీ రాష్ట్రానికి బిజెపి ఇచ్చిన హమీల్లో 90 శాతానికి పైగా నెరవేర్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు.