ఆంధ్రోళ్లకి సారీ చెప్పాకే ఏపీలో కేసీఆర్ ఎంట్రీ.. !?
గతంలో ఏపీ విభజన కాకముందు తెలంగాణ సాధన క్రమంలో ఆంధ్రోళ్లంతా పదే పదే వ్యాఖ్యలు చేసి ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురైన కేసీఆర్.. ఇప్పుడు బీజేపీపై పోరు పేరుతో బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఏపీ ప్రజలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ తలవంచి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి డిమాండ్ చేశారుచ ఆంధ్ర ప్రజలపై చేసిన కామెంట్లపై కేసీఆర్ సిగ్గు పడుతున్నాను అని ప్రకటించి..అ తర్వాతే ఆంధ్రలో అడుగు పెట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆంధ్ర ప్రజలు స్వాగతించరన్నారు. ఆంధ్ర ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అని జీవీఎల్ మండిపడ్డారు.
రాష్ట్రంలో రాజకీయాలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ కోరారు.లేదంటే కేసీఆర్ ను అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇప్పిస్తామని ప్రకటించారు. బీజేపీ నేతలు ఎవరు బీఆర్ఎస్లోకి వెళ్లే పరిస్థితి లేదని, గతంలో మా పార్టీ నుంచి వెళ్లిపోయిన కొంత మంది బీఆర్ఎస్లోకి వెళ్లారని జీవీఎల్ తెలిపారు. కానీ అది తమ పార్టీ కి సంబంధం లేని విషయంగా చెప్పుకొచ్చారు.