ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు తథ్యం...సిద్దం కండి:జీవీఎల్ మరోసారి సంచలనం
బిజెపి రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపి రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయని పునరుద్ఘాటించారు.
గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రానున్న మార్పులకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపిపై విష ప్రచారం చేశారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో నిధుల దుర్వినియోగం జరిగిందని కాగ్ నిర్ధారించిందని, అయితే కాగ్కు కేంద్రంతో గానీ, ఏ రాజకీయ పార్టీతో గానీ సంబంధం ఉండదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారని జివిఎల్ చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీని టీడీపీ ప్రచార వేదికగా మార్చారని ఆయన ఆరోపించారు.