పీడీ ఖాతాలపై సీబీఐ విచారణ జరిపించండి...గవర్నర్ కు ఎంపి జీవీఎల్ లేఖ:టిడిపి కౌంటర్
విజయవాడ: రాష్ట్రంలో అతి పెద్ద పిడి ఖాతాల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు విషయమై మరో అడుగు ముందుకేసి ఈ స్కామ్ పై సిబిఐ విచారణ జరపించాలంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు.
"గవర్నర్ గారు మీకున్న విచక్షణాధికారాలను ఉపయోగించండి...ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగత డిపాజిట్ (పీడీ) ఖాతాల్లో నిధుల జమపై సీబీఐతో విచారణ చేయించండి... 2016-17కు సంబంధించిన పీడీ ఖాతాలను కాగ్తో ప్రత్యేకంగా ఆడిట్ చేయించండి...ఇది బిహార్ పశుగ్రాసం కుంభకోణం కన్నా పెద్దది'' అని బీజేపీ ఎంపీ జీవీఎల్ తన లేఖలో గవర్నర్ ను కోరారు.
విచారణ...జరిపించండి
ఏపీలో పీడీ అకౌంట్స్లో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న బిజెపి ఎంపి జివిఎల్ అందుకు సంబంధించిన వివరాలను గవర్నర్ నరసింహన్ కు రాసిన లేఖలో వెల్లడించారు. ఎపి ప్రభుత్వం 58,539 బ్యాంక్ అకౌంట్లలో రూ.53,039 కోట్లను ప్రభుత్వం డిపాజిట్ చేసిందని, ఈ అకౌంట్ల నుండి రూ.51,448 కోట్లు థర్డ్ పార్టీకి చెల్లించారని జివిఎల్ తెలిపారు.
కాగ్ నివేదిక...పేర్కొంది
అయితే అందులో రూ.258 కోట్లకు సంబంధించి 63 పర్సనల్ చెక్కుల ద్వారా నిబంధనలకు తూట్లు పొడిచిన విషయాన్ని కాగ్ నివేదిక పేర్కొందని ఎంపి జివిఎల్ ప్రస్తావించారు. పిడి ఖాతాలకు సంబంధించి ఎంపి జివిఎల్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలకు ప్రతిస్పందనగా టిడిపి నేతలు ఆయనని దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. పీడీ ఖాతాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎంపి జివిఎల్ కు టిడిపి ఎమ్మెల్సీ టిడి జనార్ధన్ శనివారం ఒక ప్రకటనలో సవాల్ విసిరారు.
జివిఎల్ అవివేకి...యనమల
ఈ నేపథ్యంలో ఎంపి జివిఎల్ గవర్నర్ కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పీడీ ఖాతాలపై సీబీఐ విచారణ జరపాలంటూ భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు గవర్నర్ ని కోరటం ఆయన అవివేకానికి నిదర్శనమని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. సక్రమంగా నిధుల వినియోగించేందుకే అవసరాన్ని బట్టి పీడీ ఖాతాలు ఎక్కువగా తెరవడం జరుగుతుందని యనమల వివరించారు.
అదే...బిజెపి కుట్ర
అసలు బ్యాంకు ఖాతాల వల్లే నిధుల దుర్వినియోగం అదడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని...పీడీ ఖాతాల వల్ల ఆ అవకాశమే లేదని యనమల స్పష్టం చేశారు. అలాగే కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తే వారు సంతృప్తి చెందినట్లు యనమల తెలిపారు. ఏదో ఒక వంక చూపి రాష్ట్రానికి నిధులు రాకుండా చేయాలన్నదే బిజెపి కుట్రని మంత్రి యనమాల రామకృష్ణుడు ఆరోపించారు.