దత్తపుత్రుడు: పవన్పై లోకేష్, మోడీపై రామ్మోహన్నాయుడు, టీడీపీకి జీవీఎల్ కౌంటర్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ దత్తపుత్రుడు అని, వైసీపీ అధినేత వైయస్ జగన్ దొంగబ్బాయి అని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఒంగోలు ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడారు. వారిద్దరు సీఎం చంద్రబాబును విమర్శిస్తున్నారన్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు దాక్కున్నాయన్నారు.
వ్యక్తిగతంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని, అందుకు బాధ కలుగుతోందని చెప్పారు. ముప్పై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని, సవాల్ చేస్తున్నానని, తనపై చేసే ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలన్నారు. లేదంటే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలన్నారు. పార్లమెంటులో ప్రధాని మోడీని నిలదీస్తే కేసులు వెలికి తీస్తారన్న భయంతోనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారన్నారు.
అనుభవం లేని వ్యక్తులతో ఏపీకి న్యాయం జరగదని ఎంపీ మురళీ మోహన్ అన్నారు. మోసం చేసే ప్రధాని ఉండటం మన దురదృష్టమని మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. తాము పార్లమెంటులో ప్రధానిని నిలదీస్తే దొడ్డి దారిలో వెళ్లిపోయారన్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ భాషలో అడిగినా ఆయనకు అర్థం కావడం లేదన్నారు.
టీడీపీకి జీవీఎల్ కౌంటర్
బీజేపీపై, కేంద్రంపై విమర్శలు చేస్తున్న టీడీపీకి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహ రావు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు తాను రెండు పేజీల లేఖ రాసినట్లు తెలిపారు. ఆ లేఖలను కూడా పోస్ట్ చేశారు. అసత్య రాజకీయ ప్రచారం ఆపాలని తాను చంద్రబాబుకు లేఖ రాశానని, దాని బదులు ఏపీ అభివృద్ధిపై దృష్టి సారించాలని రాసినట్లు తెలిపారు. పెట్టుబడులు, ఉద్యోగాలకు అవసరమైన కేంద్రం ఇండస్ట్రియల్ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన రెండు పేజీల లేఖల్లో కేంద్రం ఏం చేసిందో వివరిస్తూ టీడీపీకి గట్టి షాకిచ్చారు.