సుజనా చౌదరికి భారీ షాక్- అమెరికా పారిపోయే యత్నం- ఢిల్లీ ఎయిర్పోర్టులో అడ్డగింత...
బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి గట్టి షాక్ తగిలింది. పెండింగ్ కేసుల విషయంలో సుజనాపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో ఆయన్ను ఢిల్లీ ఎయిర్పోర్టులో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన కలకలం రేపుతుండగానే ఆయన దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం మరింత చర్చనీయాంశమైంది.
రూ.5700 కోట్ల మేర టోపీ
దేశంలో పలు జాతీయ బ్యాంకులకు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కుటుంబానికి చెందిన సుజనా గ్రూపు సంస్ధలు రూ.5700 కోట్ల మేర టోపీ పెట్టాయి. ఈ మేరకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో సుజనా దేశం విడిచి వెళ్లిపోకుండా ఈడీ ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అన్ని విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లడంతో అక్కడ సుజనాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఆరు ఖరీదైన కార్లు సీజ్
వాస్తవానికి సుజనా గ్రూపు సంస్ధల రుణాల ఎగవేత వ్యపహారంలో ఎంపీ సుజనా చౌదరిని ప్రశ్నించేందుకు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఇప్పటికే డొల్ల కంపెనీల పేర్లతో ఆయన రిజిస్ట్రేషన్ చేసిన ఆరు ఖరీదైన కార్లను ఈడీ అదికారులు సీజ్ చేశారు. సుజనా చౌదరి వ్యక్తిగత పూచీ కత్తుపై తీసుకున్న రూ.5700 కోట్ల రూపాయల రుణాల ఎగవేత వ్యవహారంలో ఆయన్ను ప్రశ్నించాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఆయనపై ఈడీతో పాటు ఫెమా, డీఆర్ఐ, సీబీఐ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విచారణ ఎదుర్కోకుండా ఆయన అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమవుతోంది.
Recommended Video
లుకౌట్ నోటీసులు జారీ
ఇప్పటికే సుజనా గ్రూపు సంస్ధలపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదైన నేపథ్యంలో సుజనాపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. వీటిని లెక్కచేయకుండా ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో అమెరికా ప్రయాణించేందుకు వెళ్లిన సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగిన సుజనా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. లుక్ వుట్ నోటీసుల విషయంలో హైకోర్టులో ఆయనకు ఊరట లభిస్తే తప్ప ఆయన విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉండదు.