జగన్ సర్కారుపై అమిత్కు బీజేపీ ఎంపీల ఫిర్యాదు- దేవాలయ ఘటనలపై జోక్యానికి వినతి..
ఏపీ దేవాలయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పలు ఘటనలపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. తాజాగా అనారోగ్యం నుంచి కోలుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్షాను పార్లమెంటులో కలిసిన బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ ఏపీ దేవాలయాల ఘటనలపై ఫిర్యాదు చేశారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు.
బీజేపీ నేతల గృహనిర్బంధం: నేతల అరెస్టు: వేడెక్కించిన ఛలో అమలాపురం
తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంతో పాటు విజయవాడ కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాల మాయం వంటి అంశాలను బీజేపీ ఎంపీలు జీవీఎల్, సీఎం రమేష్ రాతపూర్వకంగా అమిత్షాకు ఫిర్యాదు చేశారు. అంతర్వేదిలో 62 ఏళ్ల చరిత్ర కలిగిన రథం దగ్ధం అయిందని, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి రథంపై వెండి సింహాల మాయం అయ్యాయని వారు తెలిపారు.
ఏడాదిలో ఇలాంటి 18 ఘటనలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో తాజా ఘటనలతో రాష్ట్రం, రాష్ట్రం బయట ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఎంపీలు పేర్కొన్నారు. హిందువుల మనోభావాలతో కూడిన విషయాల్లో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయడం లేదని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.
హిందువుల మనోభావాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్న వైసీపీ ప్రభుత్వం.. అంతర్వేదిలో చర్చిపై ఆగంతకులు రాళ్లు విసిరిన ఘటనపై మాత్రం హడావిడిగా చర్యలు తీసుకుందని బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అంతర్వేదిలో చర్చిపై రాళ్లు విసిరిన ఘటనలో 41 మంది హిందూ సంఘాల కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్కు పంపినట్లు వారు అమిత్షా దృష్టికి తెచ్చారు. ఇతర మతాల వారిని బుజ్జగించేందుకు వైసీపీ ప్రభుత్వం హిందువులను టార్గెట్ చేస్తోందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. అంతర్వేదిలో రధం దగ్ధంపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా ప్రభుత్వం బీజేపీ నేతలను అనుమతివ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Recommended Video
గుంటూరులో పోలీసు స్టేషన్పై దాడి చేసిన ముస్లింలపై కేసులు ఉపసంహరించుకుందని కూడా బీజేపీ ఎంపీలు అమిత్షాకు తెలిపారు. ఛలో అమలాపురానికి బయలు దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు నేతలను నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేశారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలా జగన్ సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని, హిందువులపై, దేవాలయాలపై దాడులు ఆపాలని సూచించాలని వారు కోరారు. విపక్షాలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై తగిన సమయంలో తగిన విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తన ఫిర్యాదులో బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు.