చంద్రబాబుకు బిజెపి షాక్: విశాఖలో మోడీ రోడ్ షో, పొత్తు చిత్తేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం కావడానికి బిజెపి ప్రణాళికలను రచిస్తోంది.ఈ మేరకు ఈ ఏడాది జూలైలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకొంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం కావడానికి బిజెపి ప్రణాళికలను రచిస్తోంది.ఈ మేరకు ఈ ఏడాది జూలైలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకొంది.పార్టీ జాతీయ కార్యవర్గసమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ 23 కిలోమీటర్లమేర రోడ్ షో నిర్వహించనున్నారు.
ఉత్తరాదిలో బిజెపి ప్రత్యర్థులను చిత్తుచేసింది.ఇక దక్షిణాది రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నాలను చేస్తోంది.ఆ పార్టీకి దక్షిణాదిలో చెప్పుకోదగిన బలం లేదు. దక్షిణాదిలో గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ఆ తర్వాత కర్ణాటకలో ఆ పార్టీ విజయం సాధించలేదు.
అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలతో కాకుండా స్వతహాగానే తమ బలాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రీకరించింది.2019 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుండి గత ఎన్నికలకంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొనే దిశగా బిజెపి వ్యూహారచనచేస్తోంది.
ప్రధానంగా రెండు తెలుగురాష్ట్రాలపై బిజెపి కేంద్రీకరించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించింది.మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
బలం పెంచుకొనేందుకు బిజెపి ప్లాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతహాగా తన బలాన్ని పెంచుకొనేందుకుగాను బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది. ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చిన సందర్భంగా టిడిపితో పొత్తు వద్దంటూ కార్యకర్తలు ప్ల కార్డులను ప్రదర్శించారు.ఈ విషయమై పార్టీ నాయకులను అమిత్ షా ఆరా తీశారు. అయితే పొత్తువిషయమై ఎవరు కూడ మాట్లాడకూడదని రెండు పార్టీల నాయకులకు తమ తమ పార్టీ శ్రేణులకు సూచించారు.
జూలైలో బిజెపి జాతీయ కార్యవర్గసమావేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి జాతీయకార్యవర్గసమావేశాలను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణను బిజెపి ప్లాన్ చేయనుంది. అయితే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడే అంశాలపై చర్చించనున్నారు. అదే విధంగా ఒడిశా రాష్ట్రంలో కూడ ఏ రకంగా అధికారాన్ని కైవసం చేసుకొవాలనే అంశంపై కూడ ఆ పార్టీ ఈ సమావేశంలో చర్చించనుంది. త్రిపుర రాష్ట్రంలో కూడ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో కూడ బలోపేతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
మోడీతో రోడ్ షో
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని మోడీ జూలై15వ, తేదిన విశాఖపట్టణానికి రానున్నారు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 23 కిలోమీటర్లపాటు ప్రధానమంత్రి మోడీతో రోడ్ షో నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ నుండి ఎన్ ఏ డి జంక్షన్ నుండి పోతినమల్లయ్యపాలెంవరకు రోడ్ షో నిర్వహించేలా బిజెపి నేతలు ప్లాన్ చేస్తున్నారు.ఒడిశాలో గతంలో ఇదే తరహాలో నిర్వహించిన మోడీ రోడ్ షో కు మంచి స్పందన లభించిన విషయాన్ని బిజెపి నాయకులు గుర్తుచేస్తున్నారు.
రోడ్ షో తో వెనుక ఉద్దేశ్యమిదే
వైజాగ్ లో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. నావికదళ సిబ్బంది, షిప్ యార్డ్, స్టీల్ ఫ్లాంట్, బీహెచ్ వీపి, హెచ్ పీ సీఎల్ , హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ వంటి సంస్థల ఉద్యోగులు కూడ వైజాగ్ లో నివాసం ఉంటారు. వీరిలో 40 శాతం స్థానికేతరులే. వీరిని ఆకట్టుకొనేందుకుగాను బిజెపి ప్లాన్ చేస్తోంది.ఇందులో భాగంగానే రోడ్ షో నిర్వహించాలని స్థానిక బిజెపి నాయకులు ప్లాన్ చేస్తున్నారు.
పొత్తు చిత్తేనా?
2019 ఎన్నికలవరకు టిడిపితో పొత్తు కొనసాగుతోందని బిజెపి జాతీయ నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై ఎవరు బహిరంగంగా మాట్లాడకూడదని కూడ హెచ్చరించారు. అయితే టిడిపితో పొత్తు వల్ల పార్టీని బలోపేతం చేసుకొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.దరిమిలా టిడిపితో పొత్తును తెగతెంపులు చేసుకొంటేనే తమకు ప్రయోజనమనే అభిప్రాయాన్ని స్థానిక బిజెపి నాయకులు అమిత్ షాకు వివరించారు.అయితే అన్ని విషయాలను ఆయన విన్నారు.అయితే సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకొంటామని ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై అమిత్ షా తో బాబు ఇటీవల విజయవాడలో చర్చిచంచారు. అయితే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయాలపై మరోసారి చర్చించే అవకాశాలు లేకపోలేదు.