అమరావతికే బీజేపీ జాతీయ నేతల జై- కేంద్రం స్పష్టత ఇచ్చినా-జాతి నేతలే అంటున్న సాయిరెడ్డి
అమరావతినే ఏపీ రాజధానిగా ఉంచే విషయంలో కేంద్రం పలుమార్లు స్పష్టత ఇచ్చింది. ఓ రాష్ట్ర రాజధాని ఎంపిక చేసుకునే విషయం సదరు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, ఇందులో కేంద్రం జోక్యం ఉండబోదని పదే పదే చెబుతోంది. ఏకంగా హైకోర్టులోనే దాఖలు చేసిన అఫిడవిట్లలోనే కేంద్రం ఈ విషయాన్ని గుర్తు చేస్తోంది. అయినా బీజేపీ జాతీయ కార్యవర్గానికి తాజాగా ఎన్నికైన ఏపీ నేతలు మాత్రం అమరావతే రాజధాని అంటూ చేస్తున్న ప్రకటనలు సొంత పార్టీపై ధిక్కారమా లేక సొంత అజెండా అమల్లో భాగమా అన్నది తేలడం లేదు. బీజేపీ నేతలు పురంధేశ్వరి, సత్యకుమార్ వంటి వారు చేస్తున్న ప్రకటనలపై స్పందించిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి వీరిని తాజాగా జాతీయ నేతలు కాదు జాతి నేతలుగా అభివర్ణించడం ఆసక్తికరంగా మారింది.
హైకోర్టు తీర్పులపై కేంద్రం జోక్యం కోరిన వైసీపీ- అమరావతి, ఫైబర్ గ్రిడ్పై సీబీఐ విచారణ కూడా..
అమరావతిపై బీజేపీ పిల్లిమొగ్గలు...
గత టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ వచ్చి శంఖుస్దాపన చేసి వెళ్లారు. ఆ తర్వాత కొన్ని నిధులు కూడా కేటాయించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీయే నుంచి తప్పుకుంది. వెంటనే రంగంలోకి దిగిన ఏపీ బీజేపీ నేతలు అమరావతిలో టీడీపీ అవినీతికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేసేవారు. మోడీని, అమిత్షాను విమర్శిస్తున్న చంద్రబాబుపై నిప్పులు చెరిగేవారు. ఇందులోనూ బీజేపీలో రెండు వర్గాలు ఉండేవి. టీడీపీ అనుకూల వర్గం మాత్రం చంద్రబాబుపై ఆరోపణలు చేసేందుకు ఇష్ట పడేది కాదు. సీన్ కట్ చేస్తే ఎన్నికలు జరగడం టీడీపీ స్ధానంలో వైసీపీ అధికారంలోకి రావడం, మూడు రాజధానులు ప్రకటించడం జరిగిపోయాయి. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో గతంలో చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న నేతలంతా తెరపైకి వచ్చి అమరావతే రాజధాని అంటున్నారు. విచిత్రంగా చంద్రబాబు పేరు చెబితే భగ్గుమనే ఆయన వదిన పురంధేశ్వరి కూడా ఇప్పుడు అమరావతికి మద్దతుగా టీడీపీ అజెండాకే వంత పాడుతున్నారు.
మళ్లీ అమరావతి జపం....
గతంలో ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకున్న తర్వాత అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు గుప్పించిన బీజేపీ నేతలతో పాటు తాజాగా జాతీయ కార్యవర్గానికి ఎంపికైన తెలుగు నేతలు కూడా అమరావతే రాజధాని అంటున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని, రైతులు వైసీపీకి బుద్ది చెబుతారని విమర్శలకు దిగుతున్నారు. అసలు జగన్కు పాలనపై అవగాహనే లేదని, రాజధాని ఎలా మారుస్తారని, అమరావతి రాజధాని అనేదే బీజేపీ విధానం అంటూ జాతీయ కార్యదర్శి స్ధాయిలో ఉన్న సత్యకుమార్ వంటి నేతలు ఆరోపణలు చేస్తుండటం ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో బీజేపీ అమరావతికి మద్దతుగా ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం ఓ మాట.. బీజేపీ మరో మాట...
కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చేసింది. మూడు రాజధానుల ఏర్పాటు వైసీపీ సర్కారు పరిధిలోనే ఉందని హైకోర్టులో స్పష్టం చేసింది. అయినా బీజేపీ జాతీయ స్దాయి నేతలు అమరావతే రాజధాని, ఇదే మా పార్టీ విధానం అంటూ చేస్తున్న ప్రకటనలు సొంత ప్రభుత్వ వాదననే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. గతంలో దశాబ్దాలుగా ఏపీలో టీడీపీకి మద్దతుగా బీజేపీ ఎదగనీయకుండా అడ్డుపడిన నేతలే దీని వెనుక ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ... కేంద్రం వాదనకు వ్యతిరేకంగా మరో విధానం అమలు చేసే సమస్యే లేదు. కానీ బీజేపీ జాతీయ నేతలు మాత్రం అమరావతి విషయంలో చేస్తున్న గందరగోళ ప్రకటనలు రాష్ట్రంలోనూ ఆ పార్టీ పరిస్ధితికి అద్దం పట్టేలా ఉన్నాయి.
జాతి నేతలే అంటున్న సాయిరెడ్డి..
అమరావతిపై కేంద్రం స్పష్టమైన విధానం అనుసరిస్తున్నా దాన్ని కాదని పాతపాటే పాడుతున్న బీజేపీ నేతల తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ మండిపడ్డారు. ముఖ్యంగా గతంలో కేంద్రమంత్రిగా వ్యవహరించి ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొనసాగుతున్న పురంధేశ్వరి వంటి నేతలు అమరావతికి మద్దతుగా చేస్తున్న ప్రకటనలు వారు జాతీ నేతలే అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తద్వారా వీరు టీడీపీకి మద్దతుగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనే విషయాన్ని సాయిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికే బీజేపీలో ఉంటూ టీడీపీకి వంతపాడుతున్న సుజనాచౌదరి వంటి నేతలపై విరుచుకుపడుతున్న సాయిరెడ్డి.. మరోసారి అమరావతి విషయంలోనూ వారిని జాతి నేతలుగా సంబోధించడంపై చర్చ జరుగుతోంది.