ఏపిలో అమిత్ షా ప్లాన్: చంద్రబాబుతో తెగదెంపులేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బిజెపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది..సంస్థాగతంగా బలపడేందుకు ఆ పార్టీ వ్యూహారచన చేస్తోంది.బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బిజెపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది..సంస్థాగతంగా బలపడేందుకు ఆ పార్టీ వ్యూహారచన చేస్తోంది.బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు.
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బిజెపి టిడిపితో కలిసి పోటీచేసింది.ఈ రెండు పార్టీల కూటమికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు.ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది.అయితే బిజెపి కూడ ప్రభుత్వంలో చేరింది. కేంద్రంలో టిడిపి భాగస్వామిగా మారింది.
అయితే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పరిస్థితులు మారుతున్నాయి. 2014 నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బిజెపికి అనుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ పార్టీ స్వతహాగానే బలాన్ని పెంచుకొనేందుకుగాను ప్రయత్నాలను ప్రారంభిస్తోంది.ఈ మేరకు రెండు తెలుగురాష్ట్రాల్లో ఆ పార్టీ తన బలాన్ని పెంచుకొనే ప్రయత్నాలను ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 లో ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. ఆ సమయంలో కూడ బిజెపి, టిడిపిల మధ్య పొత్తు ఉంది.అయితే పార్టీ విస్తరణ కోసం చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.దీంతో ఆ పార్టీ టిడిపితో పొత్తు ఆధారంగానే సీట్లను గెలుచుకొనే పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో మాత్రం హైద్రాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైంది.
ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం కోసం బిజెపి ప్లాన్
ఈ ఏడాది చివరికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకుగాను ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. వచ్చే ఎన్నికలనాటికి రెండు తెలుగురాష్ట్రాల నుండి వీలైనన్ని ఎక్కువ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహాంగా కన్పిస్తోంది.ఇందులో భాగంగానే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడ కన్నేసింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు.
బిజెపి ప్లాన్ ఇదే
ఈ ఏడాది ఆగష్టు మాసంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతోనే ఆయన ఈ పర్యటన చేయనున్నారు. వన్ బూత్ టెన్ యూత్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు ప్రయత్నాలను చేస్తోంది.ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో చురుకైన కార్యకర్తలను గుర్తంచిన బిజెపి నాయకత్వం ప్రతి పోలింగ్ బూత్ కు ముగ్గురు బాధ్యులను నియమించాలని నిర్ణయించింది.ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీకి అధ్యక్షుడు, ఏజంట్ తో పాటు ఒక రాష్ట్రస్థాయి నాయకుడిని ఇన్ చార్జ్ గా నియమిస్తారు.
అమిత్ షా పర్యటన అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకుగాను అమిత్ షా పర్యటించనున్నారు. ఈ ఏడాది ఆగష్టులో 28, 29,30 తేదిల్లో రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పార్టీ సంస్థాగత విషయాలపైనే కేంద్రీకరించనున్నారు. ఈ ఏడాది జూలై 15,16 తేదిల్లో విశాఖలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. మరో వైపు ఈ నెల 25న, విజయవాడలో రాష్ట్రంలోని 42 వేల పోలింగ్ బూత్ బాధ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశాల్లో కూడ అమిత్ షా పాల్గొంటారు.
పవన్ కళ్యాణ్ దూరం..జగన్ దగ్గరౌతున్నారా?
2014 ఎన్నికల్లో టిడిపి బిజెపి కూటమికి సినీ నటుడు పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. అయితే మారిన రాజకీయపరిస్థితుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి టిడిపి కూటమికి దూరం జరుగుతున్నారు. మోడీ మతతత్వాన్ని పెంచిపోషిస్తున్నారని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తోందని పవన్ ప్రకటించారు. అయితే అదే సమయంలో వైసీపీ బిజెపికి దగ్గరౌతోందా అనే సంకేతాలను ఇచ్చినట్టు కన్పిస్తోంది. మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీతో జగన్ సమావేశం కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులకు సంకేతానికి కారణమౌతాయా అనే ఉత్కంఠ కూడ లేకపోలేదు. అయితే టిడిపిని దూరం పెట్టి వైసీపీతో బిజెపి వెళ్ళే అవకాశం ఉందా అనే చర్చ కూడ సాగుతోంది.అయితే ఈ విషయమై రెండు పార్టీల నుండి స్పష్టత రాలేదు.కాని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి లేకపోలేదు. దీంతో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి.
రాష్ట్ర నేతల తీరుపై జాతీయ నాయకత్వం ఆగ్రహం
అమిత్ షా పర్యటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జ్ సిద్దార్ధనాథ్ సింగ్ విజయవాడలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.. ప్రతి బూత్ కమిటీ నుండి ముగ్గురు ప్రతినిధులకు తగ్గకుండా అమిత్ షా సమావేశానికి ప్రతినిధులు హజరయ్యేలా ప్లాన్ చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. అయితే బూత్ స్థాయి ప్రతినిధుల పేర్లను ముందుగా పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు పంపితేనే పాస్ జారీ చేస్తామన్నారు. పోలింగ్ బూత్ ఇన్ చార్జి, అధ్యక్షుడు, ఏజంట్ తప్పనిసరిగా హజరుకావాలని ఆయన సూచించారు. అయితే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ గంగరాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు గైరాజరయ్యారు.దీంతో సిద్దార్థనాద్ అగ్రహం వ్యక్తం చేశారు..