మేం అలా చెప్పామా, మీరే ఉపయోగించుకోవట్లేదు: చంద్రబాబుకు పురంధేశ్వరి
అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నాయకురాలు పురందేశ్వరి బుధవారం మండిపడ్డారు. ఏపీలో అవినీతి బాగా పెరిగిందన్నారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నప్పటికీ తమను దోషులుగా చూపించాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి 13 జాతీయ సంస్థలు, విద్యాసంస్థలు రాలేదా చెప్పాలని నిలదీశారు. విభజన చట్టం బిల్లులోని ఏ ఒక్క హామీనైనా నెరవేర్చబోమని చెప్పామా అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ సద్వినియోగం చేసుకోవట్లేదన్నారు. బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరికాదన్నారు.
అంతకుముందు, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని ప్రధాని మోడీ తనతో అన్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉందని, తమను ఎందుకు దోషిగా చూపిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఆయనకు మనం అందరికన్నా ఎక్కువ గౌరవమిచ్చామని, ఆయన అడిగినవన్నీ చేస్తున్నామని, కానీ ఆయన ఎందుకిలా చేస్తున్నారో అర్థకావడం లేదని మోడీ తనతో చెప్పారన్నారు.
బీజేపీ విశేష్ సంపర్క్ అభియాన్
ఏపీలో విశేష్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులతో భేటీలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరంలో కన్నా లక్ష్మీనారాయణ, అనంతపురంలో హరిబాబు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పురంధేశ్వరి, కడప, విశాఖ నగరాల్లో సోము వీర్రాజు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో విష్ణు కుమార్ రాజు పర్యటిస్తారు.
రాజమండ్రిలో కంతేటి సత్యనారాయణ, గుంటూరులో మాజీ మంత్రి మాణిక్యాల రావు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఆకుల సత్యనారాయణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గోకరాజు రంగరాజు, విజయవాడ, కర్నూలులలో ఎమ్మెల్సీ మాధవ్ పర్యటిస్తారు.