వీర్రాజుకు షాక్! ఏపీ బీజేపీ చీఫ్ అంశంలో కొత్త ట్విస్ట్: తెరపైకి మాజీ ఉన్నతాధికారి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ పార్టీ అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితిల్లో ఓ మాజీ ఉన్నతాధికారి పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బీజేపీకి షాక్, ఇంత అవమానమా?: వైసీపీలోకి కన్నా-కాటసాని, జగన్కు కన్నా 2 షరతులు
ఏపీకి ప్రత్యేక హోదా పేరు కావాలని టీడీపీ, జనసేన, వైసీపీ, లెఫ్ట్ పార్టీలు బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు టార్గెట్ చేసుకున్న నేపథ్యంలో పార్టీని ముందుకు నడిపించేందుకు ఇటీవల అఖిల భారత స్థాయి అధికార పదవి నుంచి వైదొలగిన వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెడితే బాగుంటుందని యోచిస్తున్నారట.
పార్టీలో చేరిన వెంటనే పదవి ఇవ్వడం బీజేపీ సంప్రదాయాలకు విరుద్ధం. కానీ ఆ అధికారికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా సముచిత స్థానం కల్పించడంలో తప్పేమీ లేదన్న భావన వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందని అంటున్నారు.
ఇప్పటిదాకా అధ్యక్ష పదవి రేసులో కన్నా లక్ష్మీనారాయణ, ఆకుల సత్యనారాయణ, సోము వీర్రాజు, మాణిక్యాల రావు, పురంధేశ్వరి, సోము వీర్రాజు తదితరుల పేర్లు వినిపించాయి. కన్నా ఎలాగూ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన వారిలో సోము వీర్రాజు పేరు ఖరారైనట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే పలు కారణాలతో సోము వీర్రాజు పట్ల పార్టీ అధిష్ఠానం అంత సుముఖంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆకుల సత్యనారాయణ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఆయన పార్టీకి కొత్తవారు. మాణిక్యాల రావు పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అయితే, మొత్తానికి ఏపీ అధ్యక్ష పదవి విషయమై బీజేపీ ఇంకా చర్చలలో ఉంది.