తెలుగు ప్రజల సహనానికి పరీక్ష, రోజూ బిజెపికి లక్ష ఓట్లు తగ్గుదల: టిడిపి
న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు విమర్శించారు. ఏపీ రాష్ట్రం పట్ల అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సానుభూతిని చూపుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో హమీలిచ్చిన బిజెపి మాత్రం ఇప్పుడు ముఖం చాటేస్తోందని ఆయన విమర్శించారు.
లోక్సభ వాయిదా పడిన తర్వాత టిడిపి ఎంపీలు బుధవారం నాడు న్యూఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో హమీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం ఈ హమీలను తుంగలో తొక్కారని బిజెపి తీరుపై టిడిపి ఎంపీలు విమర్శలు గుప్పించారు.
అవిశ్వాసంపై చర్చ ప్రారంభమయ్యే వరకు తమ పోరు కొనసాగిస్తామని టిడిపి ఎంపీలు ప్రకటించారు. అవిశ్వాసంపై లోక్సభలో చర్చ ప్రారంభమయ్యేందుకు సహకరించాలని ఇతర పార్టీలతో సమన్వయం చేసుకొంటామని చెప్పారు.
రాష్ట్రానికి ఎన్డీఏ అన్యాయం చేస్తోంది
ఏపీ రాష్ట్రానికి ఏన్డీఏ తీరని అన్యాయం చేస్తోందని టిడిపి ఎంపీ కొనకళ్ళ నారాయణరావు విమర్శించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలని కొనకళ్ళ నారాయణరావు కోరారు. రాష్ట్ర సమస్యల పట్ల ఇతర రాష్ట్రాల ఎంపీలకు సానుభూతి ఉందన్నారు. కానీ, బిజెపికి మాత్రం ఏ మాత్రం సానుభూతి లేదన్నారు.
ప్రభుత్వం స్పందించాలి
లోక్సభ సజావుగా జరిగేందుకు ఆందోళన చేస్తున్న ఎంపీలతో ప్రభుత్వం చర్చలు జరపాలని టిడిపి ఎంపీ కొనకళ్ళ నారాయణరావు చెప్పారు. చిన్న విషయాలకే సభను వాయిదా వేయడం సరికాదన్నారు. గందరగోళం మధ్య ఆందోళనలు సాగుతున్న సమయంలో కూడ ప్రభుత్వాలు తమ బిజినెస్ను నడిపించుకొన్న సందర్భాలున్నాయని ఆయన గుర్తు చేశారు.
తెలుగు ప్రజల సహనానికి పరీక్ష
తెలుగు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని టిడిపి ఎంపీ మురళిమోహన్ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లోపల బయట తాము ఆందోళనలు కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. సభ జరగకుండా బిజెపి వ్యూహన్ని రచిస్తోందని ఆయన చెప్పారు.సభ కార్యక్రమాలు జరగకుండా ఉండాలని బిజెపి కోరుకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బిజెపికి రోజుకూ లక్ష ఓట్లు తగ్గుతున్నాయి
ఏపీకి బిజెపి తీరని ద్రోహం చేస్తోందని టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ విమర్శించారు. లోక్సభ,. రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బిజెపి ఆడుతున్న నాటకాలతో ప్రతి రోజూ ఆ పార్టీకి దేశంలో లక్ష ఓట్లను కోల్పోతోందని ఆయన చెప్పారు. నాలుగేళ్ళుగా ఏపీకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఓపికగా ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు.