చానళ్ల బ్యాన్పై బీజేపీ, ఎవరెస్టు ఎక్కిన పిల్లలకు అంతేనా
విద్యార్థుల ఫీజుల చెల్లింపునకు 1956 సంవత్సరాన్ని స్థానికతకు ప్రామాణికంగా తీసుకుంటామని తెరాస ప్రభుత్వం చెబుతోందని, మరి అదే నిబంధన సానియా మీర్జాకు వర్తించదా? అని నిలదీశారు. మహారాష్ట్రలో పుట్టి, హైదరాబాద్లో పెరిగి, పాకిస్థాన్ కోడలైన సానియాను తెలంగాణ అంబాసిడర్గా ఎలా ప్రకటిస్తారన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, అధికార ప్రతినిధి ఎస్ .ప్రకాష్ రెడ్డిలతో కలిసి బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
గత ఒలింపిక్స్లో భారత క్రీడాకారులంతా జాతీయ పతాకాన్ని పట్టుకుని స్టేడియంలో తిరిగితే పతాకాన్ని పట్టుకోకుండా సానియా అగౌరవపర్చారని ఆరోపించారు. అలాంటి సానియా మీర్జాను తెలంగాణ అంబాసిడర్గా ప్రకటించడం ఎంత వరకు సమంజసమని, పైగా ఆమెకు రూ.కోటి నజరానా ఎలా ఇస్తారని అన్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు దళిత, పేద పిల్లలకు రూ.25 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం... జాతీయ పతాకాన్ని అవమానపర్చిన సానియాకు రూ.కోటి ఇచ్చిందన్నారు.
తెరాస ప్రభుత్వం ముస్లిం సంతుష్టి విధానాలతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ముస్లింలకు మూడు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లను వర్తింపజేస్తామంటూ కేసీఆర్ మంగళవారం నాటి ఇఫ్తార్ విందులో ప్రకటించారని, మజ్లిస్ డిమాండ్ చేయగానే ప్రభుత్వ లోగోలో చార్మినార్ను ముద్రించారని, తెలంగాణలో నవాజ్ అలీ జంగ్ జయంతిని ఇంజనీర్స్ డేగా ప్రకటించారని, రంజాన్ పండగ నేపథ్యంలో ఈ నెల 25ననే వేతనాలు చెల్లిస్తామంటూ కేసీఆర్ ప్రకటించారని అన్నారు.
జీతాలు 25న ఇవ్వడం పట్ల తమకు అభ్యంతరం లేదని, కానీ దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగల సందర్భంగా కూడా ఇలాగే వేతనాలు చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. నవ తెలంగాణ నిర్మాణమంటే ముస్లింలను సంతుష్టిపర్చడమేనా అని నిలదీశారు. పైగా టీఆర్ఎస్ ఎంపీ కవిత ఇటీవల ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కాశ్మీర్, తెలంగాణ ప్రత్యేక దేశాలని, వీటిని బలవంతంగా భారత్లో విలీనం చేశారని, మళ్లీ భూభాగాలపై సర్వే చేయాలంటూ వ్యాఖ్యానించారని, ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు.
ఆమె వ్యాఖ్యలను టీఆర్ఎస్ సమర్థిస్తుందా? కేసీఆర్ ఏకీభవిస్తారా స్పష్టం చేయాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, మజ్లిస్తో అంటకాగుతూ టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. తాము మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని, ప్రభుత్వం ముస్లిం సానుకూల విధానాలను మార్చుకోకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.