"బాబును అణచివేసేందుకు బిజెపి కుట్ర": "వాటితో పండుగ చేసుకోవాలా?"
అమరావతి: మైనారిటీల పక్షాన నిలబడినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు.
కాంగ్రెసుకు పట్టిన గతే వైసిపి, బిజెపిలకు పడుతుందని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో హెచ్చరించారు. ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
చంద్రబాబుపై కేంద్రం కక్ష సాధింపు
రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బుద్ధా వెంకన్న విమర్శించారు. వైసిపి, బిజెపిలకు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆయన అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే జగన్ను బిజెపి నేతలు విమర్శించడం లేదని అన్నారు. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆర్థిక నేరస్థుడైన జగన్కు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
వాటితో పండుగ చేసుకోవాలా
విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు కోరితే కేంద్రం రూ.5 కోట్లు ఇచ్చిందని, వాటితో ఎటువంటి పండుగ చేసుకోవాలో బిజెపి చెప్పాలని ఎమ్మెల్యే అనిత అన్నారు. అభివృద్ధి చెందని జిల్లాలు ఏవంటే ఉత్తరాంధ్ర జిల్లాలని ఆమె అన్నారు. రైల్వే జోన్ ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించిందని అన్నారు.
ఎంతో ఆనందంగా ఉంటుంది
ప్రత్యేక హోదా ఇస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని అనిత మంగళవారం శాసనసభలో అన్నారు. విభజన హామీలు సకాలంలో అమలు చేయాలని, దాని కోసం రాష్ట్రం ఎంతో కాలంగా నిరీక్షిస్తోందని ఆమె అన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు మాట్లాడిన విషయాలను ఆమె గుర్తు చేశారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే చట్టప్రకారం ఏం చేయాలో అది చేయాలని చంద్రబాబు చెప్పారని ఆమె అన్నారు.
వక్రీకరించి మాట్లాడుతున్నారు...
ఆ విషయాలన్నీ ఆనాడు చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే కొంత మంది నాయకులు వక్రీకరించి హోదా ముగిసిన అధ్యాయమని అన్నట్లు, హోదా కన్నా ప్యాకేజీ ముద్దు అన్నట్లు మాట్లాడుతున్నారని అనిత అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఇప్పుడు ఏమి ఇస్తారో అవి ఇవ్వాలని ముందుకు వెళ్లామని చెప్పారు రాష్ట్రానికి దాదాపు రూ.3 లక్షల 25 వేల కోట్లు అవసరమైతే కేవలం 12 వేల కోట్లు ఇచ్చి, ఎపికీ అన్నీ చేస్తున్నామని చెబుతున్నారని ఆమె అన్నారు.