బీజేపీ టార్గెట్ 2019: ఏపీ ‘కాపు’ పైనే ఫోకస్, రంగంలోకి రామ్మాధవ్, పవన్ ప్రభావం?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య మితృత్వం చెడిన నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై టీడీపీ నేతలతోపాటు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
వ్యూహాత్మక అడుగులు
ఈ క్రమంలో బీజేపీ ఏపీలో తన సొంత బలం పెంచుకునేందుకు కసరత్తులు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో 25లోకసభ స్థానాలకు గానూ 14 స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో కీలకమైన కాపు కమ్యూనిటీని తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వెనుకబడిన వర్గాల మద్దతు కూడగట్టేందుకు కూడా తగిన విధంగా సన్నద్ధమవుతోంది.
రంగంలోకి రామ్ మాధవ్
ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ను రంగంలోకి దింపినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ ప్రయోజనాలకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించేందుకు ప్రణాళికా బద్ధంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన టీడీపీ.. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరిస్తోందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది.
‘బాబూ డ్రామాలు ఆపు- అవినీతిపై పీఎంకి ఫిర్యాదు! ఏపీకి టీడీపీ, బీజేపీలతో తీరని అన్యాయం'
ఆ వర్గంపైనే ప్రధాన దృష్టి..
బీజేపీ నేత జీవీఎల్ నర్సింహా రావు మాట్లాడుతూ.. చంద్రబాబా నాయుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ త్వరలోనే తాము ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ఏపీలో సుమారు 40శాతం జనాభా వెనుకబడిన తరగతులకు చెందినవారేనని, ఆ వర్గంపైనే ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా, ఏపీ నుంచి బీజేపీ కేవలం 2 ఎంపీ, 4 ఎమ్మెల్యేలను కలిగివుంది.
ఇలా ఆ జిల్లాల్లో కాపు ప్రభావం
ఇక ఏపీ జనాభాలో 20శాతం వరకు ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కూడా బీజేపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీరి కమ్యూనిటీ 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పవన్ ఆరోపణలను సానుకూలంగా
ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడు, కాపు వర్గానికి చెందిన ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై చేసిన అవినీతి ఆరోపణలు బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది ఇలావుంటే, ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హరిబాబు కాలాన్ని పొడిగించిన అధిష్టానం, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
మిగితా వర్గాల్లో అసంతృప్తి
‘నర్సింహారావు మినహా రాష్ట్రానికి సీఎంలు అయిన వారిలో ఎక్కువ మంది రెడ్డి వర్గానికి చెందిన వారే ఉన్నారు. వీరి జనాభా కొత్త రాష్ట్రంలో కేవలం 5శాతమే. ఇక ఆర్థికంగా బాగా ఉన్నతంగా ఉన్న కమ్మ జనాభా 10శాతం. ఈ రెండు వర్గాలే అధికారాన్ని ఎప్పుడూ దక్కించుకుంటున్నాయన్న అభిప్రాయం మిగితా వర్గాల్లో ఉంది. చిరంజీవి దక్కించుకున్న 18శాతం ఓట్లలో మెజార్టీ వాటా కాపు, యువతదే' అని బీజేపీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు.
బీజేపీలో కాపు నేతలు-టచ్లో వైసీపీ
‘గత ఎన్నికల్లో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓటు షేరింగ్ తేడా కేవలం 2.06శాతమే. దీంతో కాపు ఓట్లతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని తేలిపోయింది' అని సదరు నేత చెప్పారు. బీజేపీలో చాలా మంది కాపు నేతలున్నారని చెప్పారు. అంతేగాక, వైసీపీ కూడా తమకు టచ్ లోనే ఉన్నారని చెప్పారు. మూడు సంక్షేమ ప్రాజెక్టులు, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ మొదలగునవి కేంద్రం ఏపికి ఇచ్చినట్లయితే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
పవన్, జగన్ దగ్గర కావడంతో..
పవన్ కళ్యాణ్ పార్టీకి కొంత మొత్తంలో ఓట్లు రావొచ్చు గానీ, చెప్పుకునేంత ప్రభావితం చూపకపోయే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాపు వర్గానికి 5శాతం రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ చెప్పినప్పటికీ ఇంకా అమలు కాలేదు. ఇది కూడా టీడీపీ వైఫల్యంగానే తమకు కలిసివచ్చే అంశంగా బీజేపీ భావిస్తోంది. బీజేపీతో పవన్, జగన్ పార్టీలు కొంత స్నేహంగా ఉండటం చంద్రబాబుకు సహించడం లేదని, అందుకే తెగదెంపులు చేసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.