బాబు-జగన్-పవన్ కళ్యాణ్: వెంకయ్య వెళ్లాక బిజెపిలో మరింత గందరగోళం
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత ఏపీ బిజెపిలో మరింత గందరగోళం కనిపిస్తోందా? ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై డైలమాలో ఉన్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి: వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత ఏపీ బిజెపిలో మరింత గందరగోళం కనిపిస్తోందా? ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై డైలమాలో ఉన్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదీ జగన్ మాట: ప్రశాంత్ కిషోర్ తాజా వ్యూహం, రివర్స్ అవుతోందా?
వెంకయ్య వెళ్లాక మరింత గందరగోళం
గత మూడేళ్లుగా ఏపీలో బిజెపి.. టిడిపి చాటు పార్టీగా కనిపించిందని అంటున్నారు. అందుకు నాడు కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు కూడా ఓ కారణంగా చెబుతారు. వెంకయ్య కారణంగా టిడిపి చాటున ఉన్న బిజెపి ఎదుగలేకపోతుందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వెంకయ్య ఉపరాష్ట్రపతి అయ్యారు. ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో తెలియక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు.
బిజెపి అధ్యక్ష పదవి విషయంలో డైలమా
ప్రస్తుతం ఏపీ బిజెపి అధ్యక్ష పదవిపై స్థానిక నేతలు డైలమాలో ఉన్నారు. రేసులో కన్నా లక్ష్మీనారాయణ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆయనకు బాధ్యతలు అప్పగించడం మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరికో ఒకరికి బాధ్యతలతో సరిపోదని, అసలు రాష్ట్రంలో బిజెపి పోషించే పాత్రపై స్పష్టత కావాలంటున్నారు.
ఎన్నో అంశాలపై క్లారిటీ ఇవ్వాలి
2019లో టిడిపితో కలిసి పోటీ ఉంటుందా? లేదా ఒంటరిగా ముందుకు వెళ్తామా అనే అంశంపై అధిష్టానం నుంచి క్లారిటీ రావాలని ఏపీ బిజెపి నేతలు కోరుతున్నారు. మరోవైపు, జనసేనతో ఎలా ముందుకు వెళ్లాలి? ఆ పార్టీతో చర్చలు ఎలా సంబంధాలు నెరపాలి? అనే అంశాలపై కూడా క్లారిటీ కావాలని అంటున్నారు.
ఇప్పటికైనా ఎదగాలి
నిజానికి ఏపీలో టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు బిజెపికి అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ గత మూడేళ్లు టిడిపి చాటు రాజకీయాలు దెబ్బతీశాయని అంటున్నారు. ఎన్నికలకు మరెంతో దూరం లేనందున ఇప్పటికైనా పార్టీ ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలంటున్నారు. అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా క్లారిటీ కావాలంటున్నారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వారు రెచ్చిపోయినా..
2019 ఎన్నికల నాటికి టిడిపికి దూరం జరగాలనుకుంటే చంద్రబాబు ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటాలు చేయాలి అనే అంశంపై చర్చించి ముందుకెళ్లాలని భావిస్తున్నారు. వేరుగా పోటీ చేయాలనుకుంటే పురంధేశ్వరి, కన్నా, సోము వీర్రాజు వంటి నేతలకు అడ్డు చెప్పవద్దనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.