JP Nadda: జగన్ సొంత జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు: రాజధానులపై ఫుల్ క్లారిటీ.. !
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపపై కన్నేశారు కమలనాథులు. రాయలసీమ జిల్లాల్లో పాగా వేయడానికి తాము చేసే ప్రయత్నాలకు కడపలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే రెండు దశల్లో జిల్లాలోని ప్రొద్దుటూరులో పార్టీ నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సారి పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టారు. ఈ నెల 4వ తేదీన జేపీ నడ్డా కడపకు రానున్నారు.
భారతీయ ఏక్తా యాత్ర పేరుతో..
నిజానికి- జేపీ నడ్డా రాష్ట్రానికి రావడానికి గల ప్రధాన కారణం.. భారతీయ ఏక్తా యాత్ర. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్) కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి భారతీయ జనతా పార్టీ- అన్ని రాష్ట్రాల్లో తరహా ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో పాల్గొనడానికి జేపీ నడ్డా కడపకు రానున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వేరు..
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వాతావరణం వేరుగా ఉంటోంది. మన రాష్ట్రం వరకూ మాత్రమే తీసుకుంటే.. పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పించడమనే మాట అటుంచితే- మూడు రాజధానుల అంశంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే బీజేపీ రాష్ట్రశాఖ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వాటన్నింటినీ కాదని- తమ పార్టీ వైఖరి ఏమిటో జాతీయ అధ్యక్షుడి హోదాలో జేపీ నడ్డా స్పష్టం చేయాల్సి ఉంటుంది.
ప్రాంతాలవారీగా.. తలోమాట
మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై బీజేపీలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయనే విషయం తెలిసిందే. ఏ ప్రాంతాలకు చెందిన నాయకులు ఆ ప్రాంతాలకుక అనుగుణంగా నోరు విప్పుతున్నారు. కర్నూలుకు చెందిన టీజీ వెంకటేష్, ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ మాధవ్.. వాటిని స్వాగతిస్తుండగా, అమరావతి ప్రాంతానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ సహా సుజానా చౌదరి బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలోనే ఇలాంటి భిన్నస్వరాలు వినిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జేపీ నడ్డా ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
కేంద్రం జోక్యం ఉంటుందా?
మూడు రాజధానులను ఏర్పాటు చేయడంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి పదేపదే చెబుతుండగా.. తోటి ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ దాన్ని తోసిపుచ్చుతున్నారు. రాజధానులను ఏర్పాటు చేయడమనే విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, పరిపాలనకు, అభివృద్ధికి అనుగుణంగా అలాంటి నిర్ణయాన్ని తీసుకునే హక్కు, అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక- వాటన్నింటికీ జేపీ నడ్డా పుల్ స్టాప్ పెట్టొచ్చని అంటున్నారు.