బిజెపి హామీ ఇచ్చింది, వెంకయ్యకు ఏపీ కష్టాలు తెలుసు: ఏచూరీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని, దానిని నిలబెట్టుకోవాలని సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరీ ఆదివారం అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడారు. ఏపీ విభజన పైన తమ వైఖరికి కట్టుబడి ఉన్నామన్నారు. లోటు బడ్జెట్తో ఇబ్బందిపడుతున్ ఏపీని కేంద్రమే ఆదుకోవాలన్నారు.
పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన వాళ్లు ఇప్పుడు కేంద్రమంత్రులుగా ఉన్నారని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏపీని వదిలేసి రాజకీయ లబ్ధి కోసం వాడుకుందన్నారు. యూపీఏ 1, యూపీఏ 2 అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కారణమని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని సిపిఐ నేత రాజా అన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. గత ప్రభుత్వం హామీని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని, ఏపీ సమస్యలు వెంకయ్య నాయుడికి తెలియనివి కాదన్నారు.