బీజేపీపై బాబు 'చేరికల' అసహనం: సాయంపై ట్విస్ట్, లెక్కతో ఇరకాటంలో బాబు, కొత్త ప్రశ్నలు!
అమరావతి: బీజేపీపై తెలుగుదేశం ఆగ్రహానికి కారణం ఇదీ అంటూ కమలం పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఓ కారణం చెప్పారు. అసెంబ్లీ సీట్లు పెంచమని టీడీపీ అడుగుతోందని, కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని, ఇదే టీడీపీని ఎక్కువగా ఆగ్రహానికి గురి చేసిందంటున్నారు.
చదవండి: ఢిల్లీ సాక్షిగా జగన్కు షాక్! రెండ్రోజుల్లో బాబు కీలక నిర్ణయం: అక్కడ సోనియా, ఇక్కడ పవన్ కళ్యాణ్
బీజేపీపై కోపానికి అసలు కారణం సీట్ల పెంపు లేకపోవడమే అన్నారు. 175 సీట్లు 225 అయి ఉంటే టీడీపీ నోరు మెదిపేది కాదన్నారు. మనసులో ఒకటి పెట్టుకొని ప్రజల్లో మరొకటి చెబుతున్నారన్నారు. టీడీపీకి రాజకీయ లబ్ధే కానీ సమస్యలు పట్టవన్నారు.
చేరికలు, సీట్ల పెంపు ఆశలు, అందుకే
2014 ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరారు. వైసీపీ నుంచే ఏకంగా ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు చేరారు. అందులో నలుగురు మంత్రులు కూడా అయ్యారు. ఇప్పటికే చేరికలపై టీడీపీలో అసంతృప్తులు బాగా ఉన్నాయి. 2019 ఎన్నికల సమయానికి ఈ అసంతృప్తులు తగ్గాలంటే సీట్ల పెంపు ముఖ్యం. సీట్లు పెరుగుతాయని, అప్పుడు అందరికీ సర్దుబాటు చేయవచ్చని చంద్రబాబు భావించారు. కానీ అది కుదిరేలా లేదు. ఈ కారణం వల్లే బీజేపీపై టీడీపీకి ఆగ్రహం ఉందని వీర్రాజు చెబుతున్నారు.
ఇదీ సాయం లెక్క
ఏపీకి కేంద్రం నుంచి సాయం అందడం లేదన్న టీడీపీ వ్యాఖ్యలకు బీజేపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికే ఎంపీ హరిబాబు లెక్కలు చెప్పారు. రెవెన్యూ లోటు కింద రూ.3975 కోట్లు, రాజధానికి రూ.2500 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.1050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.4662.28 కోట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.135 కోట్లు, జాతీయ విద్యా సంస్థలకు రెండేళ్లలో రూ.541.47 కోట్లు, ఎయిమ్స్కు రూ.54.51 కోట్లు ఇచ్చామని, విభజన చట్టం ప్రకారం ఇప్పటి వరకు ఇచ్చింది రూ.12,918.26 కోట్లు అని లెక్క చెప్పారు. ఏపీకి ఎన్నడూ లేనంత సాయం చేశామన్నారు.
ట్విస్ట్.. ఆ నిధులు ఇచ్చేందుకు 2022 వరకు టైమ్
రాష్ట్రానికి ఇంత సాయం చేసినా, ఇన్ని నిధులు ఇచ్చినా, వాటి లెక్కలు చూపకుండా నిధులు ఇవ్వడం లేదంటూ టీడీపీ విమర్శించడం సరికాదని బీజేపీ నాయకులు సోము వీర్రాజు, హరిబాబు, జీవీఎల్ నర్సింహా రావు, కన్నా లక్ష్మీనారాయణలు వేర్వేరుగా మండిపడ్డారు. నిధుల విడుదలకు 2022 వరకు గడువు ఉందని, లేనిపోని రాద్దాంతం ఎందుకని మరో ట్విస్ట్ ఇచ్చారు. మొన్నటి వరకు మొనంగా ఉండి, ఇప్పుడు యాగీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ వాదనకు చెక్
గత నాలుగేళ్లుగా ఏపీకి చేసిన సాయంపై హరిబాబు ఏకంగా 27 పేజీల నివేదికను ఢిల్లీలో విడుదల చేశారు. దీంతో టీడీపీ వాదనలకు గణాంకాలతో చెక్ పెట్టారు. పొత్తులపై తేల్చుకోవాల్సింది టీడీపీయేనని తేల్చి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడవద్దని బీజేపీ నేతలు హితవు పలికారు.
బీజేపీ కొత్త ప్రశ్నలు
టీడీపీ ఎంపీలు సోనియా గాంధీతో ఎలా భేటీ అవుతారని సోము వీర్రాజు నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని కన్నా అన్నారు. తమను ముంచాలని చూస్తే ఆయన మునిగిపోతారని హెచ్చరించారు. కేంద్రం ఎంత ఇచ్చింది, ఎంత ఖర్చు చేశారో బహిరంగ ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. ఈవెంట్ల పేరుతో, సదస్సుల పేరుతో ఫైవ్ స్టార్ హోటళ్లకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, ఏపీకి నిధుల లోటు ఉందని టీడీపీ అంటుంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేనట్లుగా చంద్రబాబు తీరు ఉందని విష్ణు కుమార్ రాజు అన్నారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు నిరసనలకు దిగుతున్నారా అని నిలదీశారు.
పదవుల్లో కొనసాగుతూ ఎలా ప్రశ్నిస్తారు
కేంద్రమంత్రులుగా ఉంటూ, మిత్రపక్షంగా ఉంటూ టీడీపీ తమను ఎలా ప్రశ్నిస్తుందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఏపీ సక్రమంగా వినియోగించలేదని, అవినీతికి పాల్పడిందని, వాటిని ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు. అసలు బీజేపీ లేకుంటే 2014లో టీడీపీకి అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. బీజేపీకి స్వతంత్రంగా 18 శాతం ఓట్లు సాధించుకునే సత్తా ఉందని, కానీ టీడీపీ తక్కువ శాతం ఓట్లతో గెలిచిందని దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పేందుకు భయం ఎందుకని ప్రశ్నించారు.