దాడి జరగలేదు, కానీ: డీజీపీ, అమిత్ షా కాన్వాయ్ కార్లే మా వైపు దూసుకొచ్చాయి: టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్
చిత్తూరు/అమరావతి: తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కాన్వాయ్ పైన రాళ్ల దాడి జరగలేదని డీజీపీ మాలకొండయ్య అన్నారు. శనివారం బీజేపీ నేతలు ఆయనను కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ నేతలు వెళ్లిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
అమిత్ షా వాహనంపై దాడి జరగలేదని తాము బీజేపీ నేతలకు చెప్పామన్నారు. మొదట అమిత్ షా కాన్వాయ్లోని ఆరు వాహనాలు వెళ్లాయని, ఏడో వాహనంపై ఓ వ్యక్తి కర్రతో కొట్టాడని చెప్పారు. రాళ్లు వేసినట్లు విజువల్స్ లేవన్నారు. అద్దం పగిలిన తర్వాత వాహనంలోని వారు దిగారని, అప్పుడు ఘర్షణ జరిగి ఇరువర్గాలు కొట్టుకున్నాయన్నారు.
అమిత్ షాకు ఎలాంటి భద్రత ఇవ్వాలో అలా ఇచ్చాం
కారుపై కర్ర విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ చెప్పారు. అతని చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామన్నారు. అమిత్ షా బందోబస్తు విషయమై మాట్లాడుతూ.. జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న ప్రముఖుడికి ఎలాంటి భద్రత ఇవ్వాలో అంత ఇచ్చామన్నారు. పోలీసులు ఏమైనా తప్పు చేస్తే విచారణ జరిపి అవసరమైతే చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ వారు ఫిర్యాదు చేశారని, అలాగే టీడీపీ వారు కూడా తమపై దౌర్జన్యానికి దిగారని మరో ఫిర్యాదు ఇచ్చారన్నారు. తమపై భౌతికదాడులు జరుగుతున్నాయని బీజేప నాయకులు చెప్పారని అలాంటివి ఉంటే విచారణ చేస్తామన్నారు.
చంద్రబాబు బాధ్యత వహించాలి
అమిత్ షా కాన్వాయ్పై దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దాడికి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల మానవ హారాలు నిర్వహించారు. టీడీపీ గూండాలు ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. అమిత్ షాకు భద్రతను ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందన్నారు. ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడికే భద్రత లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు.
టీడీపీ కార్యకర్త అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యే ధర్నా
తిరుపతిలో టీడీపీ, బీజేపీల ఆధ్వర్యంలో పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు శనివారం వేర్వేరుగా ఆందోళనలు చేపట్టారు. అమిత్ షా కాన్వాయ్లోని కారు అద్దాలు పగిలిపోవడానికి బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న తెలుగు యువత జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం యాదవ్ను పోలీసులు శుక్రవారం రహస్య ప్రదేశంలో ఉంచారు. అతనిని విడిచిపెట్టాలని టీడీపీనాయకులు కోరారు. కానీ పోలీసులు నిరాకరించారు. దీంతో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ శుక్రవారం అర్ధరాత్రి 12.10 గంటల నుంచి శనివారం ఉదయం తొమ్మిది గంటల వరకు అలిపిరి పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. వెంటనే సుబ్రమణ్యం యాదవ్ను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేతల పట్టు, కార్యకర్తకు బెయిల్
పోలీసులు టీడీపీ నేతలతో చర్చించారు. తమ కార్యకర్తను విడిపించే వరకు తాము అక్కడి నుంచి కదలమని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. అనంతరం పోలీసులు సుబ్రమణ్యం యాదవ్ను బెయిల్పై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ.. అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ హోదా ఇవ్వాలని శాంతియుతంగా టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారన్నారు.
పోలీసుల పక్షపాతం.. టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణ
టీడీపీ కార్యకర్తలపైకి అమిత్ షా కాన్వాయ్లోని రెండు వాహనాలు దూసుకువచ్చాయని ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. అనుకోని సంఘటనతో తమ కార్యకర్తలు అప్రమత్తమయ్యే లోపే తెలుగు యువత జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం యాదవ్ పట్టుకున్న ప్లకార్డు కర్ర తగిలి వాహనం అద్దం పగిలిపోయిందన్నారు. దీనిపై బీజేపీ నాయకులు కుట్ర రాజకీయాలతో గందరగోళ పరిస్థితులను సృష్టించడానికి టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని, దాడిలో సుబ్రహ్మణ్యం యాదవ్ను కోలా ఆనంద్, అతని అనుచరుడు రాజా కొట్టడం దుర్మార్గమన్నారు. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, కానీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేస్తే పట్టించుకున్నారని, పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ నేతల ఆగ్రహం
మరోవైపు, టీడీపీ కార్యకర్తలు ఓ ప్లాన్ ప్రకారమే అమిత్ షా కాన్వాయ్ పైన దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద రాస్తారోకో చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గూండాల్లా రెచ్చిపోయారన్నారు.