గురజాలలో బీజేపీ బహిరంగ సభ .. భగ్నానికి పోలీసుల యత్నం .. కన్నా అరెస్ట్ కు రంగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనలో వైఫల్యాలను వివరించడానికి భారతీయ జనతాపార్టీ గుంటూరు జిల్లా గురజాలలో సోమవారం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది . ఉదయం 10.30 గంటలకు ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగే ఈ సభలో ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గోననున్నారని బీజేపీ నేతలు తెలిపారు. అయితే నేడు గురజాలలో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు సభ నిర్వహణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గురజాలలో 144 సెక్షన్ అమలు... సభకు అనుమతి లేదన్న పోలీసులు
అందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురజాల వెళ్లడానికి బయలుదేరిన క్రమంలో ఆయన ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది . గుంటూరుకు వచ్చిన గురజాల సీఐ రామారావు, తమ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, పోలీస్ యాక్ట్ 30ని కూడా అమలు చేస్తున్నామని కన్నా లక్ష్మీ నారాయణకు తెలియజేశారు. గురజాలకు బయలుదేరవద్దని చెబుతూ, నోటీసులను అందించారు. అయితే, వాటిని తీసుకునేందుకు కన్నా లక్ష్మీనారాయణ నిరాకరించారు.ఎట్టిపరిస్థితుల్లోనూ గురజాలలో సభ నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు.
కన్నా అరెస్ట్ కు రంగం సిద్ధం .. గురజాల మార్గంలో రహదారుల దిగ్బంధం
తాను గురజాలకు వెళుతున్నానని చెబుతూ బయలుదేరిన కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మార్గమధ్యంలో ఆయనను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు, గుంటూరు నుంచి గురజాల వరకూ రహదారులను దిగ్బంధం చేశారు. ఫిరంగిపురం, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నరసరావుపేట మార్గాల్లో ఆయన ఎటునుంచి గురజాలకు వెళ్లాలని ప్రయత్నించినా, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
దాచేపల్లి వద్ద అరెస్ట్ చేసే చాన్స్ .. సభ నిర్వహించాలని బీజేపీ పట్టుదల
ప్రధానంగా గురజాలకు 12 కిలోమీటర్ల దూరంలోని దాచేపల్లి వద్ద ఆయన్ను నిలువరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు ఈ సభను విజయవంతం చేయాలని భావిస్తున్న బీజేపీ వర్గాలు పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా, పోలీసులు ఎన్ని వివాదాలు సృష్టించినా గురజాల బిజెపి సభ నిర్వహించి తీరుతామని పట్టుదలతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.ఇక బీజేపీ సభ సక్సెస్ అవుతుందా? కన్నా అరెస్ట్ తో అసలేం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో తేలనుంది.