చంద్రబాబు టార్గెట్: తెలంగాణ లాగే బిజెపి రాయలసీమ చిచ్చు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేయడానికి రాయలసీమ చిచ్చు పెట్టడానికి బిజెపి సిద్ధమైంది.
బైరెడ్డి రాజధాని డిమాండ్: ఏమిటీ శ్రీబాగ్ ఒడంబడిక, ఎందుకు?
రాయలసీమ సమస్యల పరిష్కారానికి ఆ ప్రాంతానికి చెందిన బిజెపి నాయకులు శుక్రవారంనాడు కర్నూలులో అత్యవసరంగా సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై గొంతు విప్పి, కేంద్రంపై విరుచుకుపడుతున్న సమయంలో బిజెపి రాయలసీమ ఎజెంాడాను ముందుకు తెచ్చింది.
అప్పటి తెలంగాణలాగే...
తెలంగాణలో పాగా వేయడానికే అన్నట్లు బిజెపి 1998లో ప్రత్యేక తెలంగాణ ఎజెండాను ఎత్తుకుంది. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అనే నినాదాన్ని కూడా ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో తీర్మానం చేసింది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన తొలి జాతీయ పార్టీగా నిలిచింది.
ఇప్పుడు రాయలసీమ ఎజెండా....
చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి రాయలసీమ ఎజెండాను బిజెపి తెర మీదికి తెచ్చింది. నిజానికి, రాయలసీమ ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తికి చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు రాయలసీమ నాయకులను తమతో కలుపుకుని వెళ్లడానికి ఆంధ్ర నాయకులు శ్రీబాగ్ ఒడంబడిక చేసుకున్నారు. ఆ ఒడంబడిక అమలు కాకాపోగా, తెలంగాణను కలుపుకుని అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్టం అవతరించింది.
అభివృద్ధి అంతా అక్కడే...
అభివృద్ధి అంతా అమరావతి చుట్టుపక్కలే కేంద్రీకృతమైందనే విమర్శలు రాజకీయేతర వర్గాల నుంచి గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. రాజధానిని అమరావతిలో పెడుతున్నందున హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు బిజెపి అదే మాట అంటూ కాస్తా ముందుకు కూడా వెళ్లింది
రాయలసీమలో ఇలా చేయాలని..
రాయలసీమలో రెండో రాజధానిని, హైకోర్టును ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలను ఎనిమిదికి పెంచాలని బిజెపి డిక్లరేషన్ కోరింది. రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించి, రాజ్యాంగబద్ధత కల్పించాలని, బోర్డుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరింది.
ఇంకా ఇలా చేయాలని....
ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, వచ్చే బడ్జెట్లో రాయలసీమకు రూ. 20 వేల కోట్లు కేటాయించాలని బిజెపి కోరింది. హైకోర్టు ఏర్పాటుపై ప్రభుత్వం స్పషమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేసింది. అధికారమంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని, తక్షణమే వికేంద్రీకరణ జరగాలని, రాయలసీమలో హైకోర్టు సాధన కోసం ఈ నెల 28వ తేదీన ఆందోళన చేస్తామని బిజెపి హెచ్చరించింది.
చంద్రబాబుకు గడువు పెట్టిన బిజెపి....
2019 కల్లా గాలేరు నగరి, హంద్రీనీవా, గురు రాఘవేంద్ర స్వామి ప్రాజెక్టులను పూర్తి చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. 2019లో ఎన్నికలు వచ్చేనాటికి పోలవరం ప్రాజెక్టును, అమరావతిని నిర్మించాలని పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. దానికి విరుగుడుగానే బిజెపి ఈ ప్రాజెక్టులకు కూడా 2019ని గడువుగా పెట్టినట్లు కనిపిస్తోంది.
సోము వీర్రాజు అంటూనే ఉన్నారు...
రాయలసీమకు, ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకు అన్యాయం జరిగిందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇటీవల శ్రీకాకుళం అన్నారు. వెనకబడిన ప్రాంతాలకు కేంద్రం రూ. 1050 కోట్లు విడుదల చేసిందని, అవి ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బిజెపి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది.
అప్పట్లో సీమ నేతలు ఇలా...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో అప్పట్లో కొంత మంది రాయలసీమ నాయకులు గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ముందుకు తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ విభజన అనివార్యమైతే గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ జిల్లాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారన్నారు.