గవర్నర్పై బాబు యూటర్న్ ఎందుకు? గ్రౌండ్ ప్రిపరేషనా?: ఏకేసిన సోము వీర్రాజు
రాజమండ్రి: గవర్నర్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. నాలుగేళ్లుగా మంచివారిగా ఉన్న గవర్నర్ నర్సింహన్.. ఒక్కసారిగా చంద్రబాబుకు చెడ్డవారిగా ఎందుకు కనిపిస్తున్నారని ప్రశ్నించారు.
బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. ఏపీ సీఎం తీరుపై నిప్పులు చెరిగారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోరని విధంగా 'ప్రజలే నన్ను రక్షించాలి'అని చంద్రబాబు కోరడం విచిత్రంగా ఉందన్నారు.
బాబూ.. యూటర్న్ ఎందుకు?
‘నైతిక విలువలను పక్కనపెట్టిమరీ వైయస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించిన నాడు చంద్రబాబు దృష్టిలో గవర్నర్ దేవుడు! హోదా, విభజన చట్టాలపై కేంద్రంతో మాట్లాడుతానన్నప్పుడు ఇంకా మంచివారు. కానీ ఇప్పుడేమైంది? రాజ్యాంగ పదవి అన్న ధ్యాస మర్చిపోయి గవర్నర్ను ముఖ్యమంత్రి అవహేళన చేయడం ఎంతవరకు సబబు? నరసింహన్పై చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక కారణాలేంటి? ఏమైనా భారీ గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారా?' అని సోము వీర్రాజు నిలదీశారు.
భయమెందుకు?
‘బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజలే నన్ను రక్షించాలని అని చంద్రబాబు అనొచ్చా! ఆయనే అలా మాట్లాడితే రాష్ట్రంలో ప్రజలను కాపాడేది ఎవరు? అసలు చంద్రబాబు వ్యాఖ్యల వెనుక అర్థమేంటి? నిన్నటిదాకా గవర్నర్ను ప్రశంసలతో ముంచెత్తిన సీఎం.. ఒక్కసారే యూటర్న్ తీసుకోవడానికి వెనుక కారణాలేంటి? దీని గురించి ప్రజలు ఆలోచించాలి, చర్చించాలి' అని వీర్రాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
గవర్నర్ ఇప్పుడే చెడ్డవారయ్యారా?
రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కేంద్రానికి లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబు గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగంపై గౌరవం ఉందా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించినప్పుడు గవర్నర్ మంచివారు.. ఇప్పుడు చెడ్డవారయ్యారా? అని నిలదీశారు. ప్రధాని మోడీ చైనాతో చేసుకున్న ఒప్పందాల కారణంగానే ఏపీకి పరిశ్రమలు వచ్చాయని చెప్పారు.
టీడీపీకి వ్యతిరేకంగా..
టీడీపీకి వ్యతిరేకంగా గవర్నర్ అన్ని పార్టీలను కూడగడుతున్నారని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. గవర్నర వ్యవస్థను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్.. ఊహించని రీతిలో కార్యక్రమాలను రద్దుచేసుకుని బుధవారం ఉదయమే హైదరాబాద్కు తిరుగుపయమైన విషయం తెలిసిందే.