రెండు రాష్ట్రాలు: రెండు మెనిఫెస్టోలతో బిజెపి
హైదరాబాద్: అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు షెడ్యూల్ విడులైన నేపథ్యంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగిస్తుండగా, పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు సీమాంధ్ర ప్రాంతంలో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర కీలకమని కిషన్ రెడ్డి తెలంగాణలో చెబుతుండగా... సీమాంధ్రకు విభజన కారణంగా నష్టపోకుండా చూసింది తమ పార్టీనేని వెంకయ్యనాయుడు సీమాంధ్రలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతుండగా.. సీమాంధ్ర ప్రాంతంలో కూడా పలువురు నాయకులు బిజెపిలో ఇప్పటికే చేరగా, మరికొందరు బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బుధవారం నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుతోపాటు పలువురు నాయకులు బిజెపిలో చేరారు. కాగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి దంపతులు కూడా బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బిజెపి కొత్తగా ఏర్పడబోయే రెండు రాష్ట్రాలకు వేర్వేరు మెనిఫెస్టోలను సిద్ధం చేస్తోంది. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావాలని పార్టీ వర్గాలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి.
కొత్తగా ఏర్పడబోయే రెండు రాష్ట్రాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఇరు ప్రాంత ప్రజలకు, నాయకులకు బిజెపి భరోసా కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తోంది. మార్చి 20 నుంచి మే 2వ తేదీ మధ్యలో నరేంద్ర మోడీ సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించనున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మోడీ ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయి.
ఇదే సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, తెలంగాణ ప్రాంతంలో పర్యటించనున్నారు. మార్చి 11న రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. కరీంనగర్, నిజామాబాద్లలో నిర్వహించే బహిరంగ సభల్లో సుష్మా స్వరాజ్ పాల్గొననున్నారు. నరేంద్ర మోడీతో మరోసారి తెలంగాణలో ప్రచారం చేయించేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజామాబాద్, ఆదిలాబాద్లలో మోడీతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర బిజెపి నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో మోడీ పర్యటన ఖరారు కానట్లు సమాచారం. కాగా జూన్ 2న ఏర్పడబోయే రెండు రాష్ట్రాలకు వేర్వేరు మెనిఫెస్టోలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో ప్రాంతంలో కొంత బలంగా ఉన్న కారణంగా ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్న బిజెపి, సీమాంధ్రలో మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రెండు ప్రాంతాల నుంచి బిజెపిలో పలువురు ఇతర పార్టీల నాయకులు చేరుతుండటంతో రాష్ట్ర బిజెపిలో కొత్త ఉత్సాహం వచ్చినట్లుగా కనిపిస్తోంది.