ఎపిలో అతి త్వరలో బిజెపి కీలక సమావేశం: హాజరుకానున్నపార్టీ ముఖ్యులు
విజయవాడ:ఎపిలో అతి త్వరలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి అతి కీలకమైన సమావేశం జరగనున్నట్లు తెలిసింది. విజయవాడలో జరగనున్న ఈ విస్తృతస్థాయి సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహ పలువురు భాజపా ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు తెలిసింది.
Recommended Video
విజయావాడలో జరిగే ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతల వరకు అందరినీ ఆహ్వానించనున్నట్లు సమాచారం. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య విభేదాల నేపథ్యంలో ఎపి రాజకీయాలు అనూహ్యంగా మారిపోవడంతో ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి ఈ సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశంలో ఎపి బిజెపి నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తారని తెలిసింది.
కీలక సమావేశం...హాజరయ్యేది ఎవరు?...
విజయవాడలో జరిగే ఈ కీలక సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వ్యూహకర్త రాం మాధవ్, రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు హాజరుకానున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ స్థాయి బిజెపి నేతలతో సహా అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించి రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఈ నేతలు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
బిజెపి లీగల్ సెల్ బలోపేతం...
అలాగే ఈ సమావేశంలో బిజెపి లీగల్ సెల్ బలోపేతం చేసే విషయంపై దృష్టి కేంద్రీకరించనన్నట్లు తెలిసింది. ఇప్పటివరకు అంతగా ఉనికిని చాటుకోని ఈ విభాగం ఇకపై చురుకైన పాత్ర పోషించేలా బిజెపి చర్యలు చేపట్టనుంది. ఇందులోకి సమర్థుల్ని ఆహ్వానించడం, విపక్షాల వాదనలను, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడమే ధ్యేయంగా బిజెపి లీగల్ సెల్ ను పటిష్టపర్చడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపినే ప్రధాన శత్రువుగా మారిన నేపథ్యంలో ఆ పార్టీ అవినీతి, అక్రమాలపై ఆరోపణలు చేయడంతో పాటు అందుకు సాక్ష్యాలు,రుజువులు సంపాదించే పనిని కూడా ఈ విభాగానికి అప్పగించనున్నట్లు తెలిసింది.
ఎపి బిజెపి...నూతన అధ్యక్షుడి నియామకం...
ఎపి బిజెపి నూతన అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు పేర్లు తుది జాబితాగా పరిశీలనకు వచ్చినా ఈ ముగ్గురిలో మాణిక్యాలరావునే రాం మాధవ్ ఎంపిక చేసుకున్నారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన ఇద్దరు నాయకుల్ని జాతీయ కమిటీలో తీసుకుంటామని ఒప్పించే పనిలో రాం మాధవ్ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంతా ముగిసి విజయవాడలో జరిగే సమావేశంలోనే ఎపి బిజెపి నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తారని తెలిసింది. అయితే ఈ పదవికి తనను ఎంపిక చేసినా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మాణిక్యాలరావు వెనుకాడుతున్నారనే ప్రచారం జరుగుతున్నాఏవైనా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప ఆయన్నే ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇకపై...ఎపి బిజెపి దూకుడు...
ఇప్పటిదాకా టిడిపిపై ఆరోపణల రూపంలోనే దాడులు చేస్తున్న బిజెపి ఇకపై ఆ పార్టీని ఎదుర్కొనే విషయం మరిన్ని వ్యూహాలు అమలు చేయనున్నట్లు తెలిసింది. కేవలం విమర్శలు, ఆరోపణలు చేయడమే కాకుండా టిడిపి నేతల అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు సంపాదించడం, కేసులు పెట్టడం వంటివి కూడా బిజెపి చేపట్టనున్నట్లు ఆ విషయంలో బిజెపి లీగల్ సెల్ చురుకైన పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రధానిని,బిజెపిని లక్ష్యంగా చేసుకొని టిడిపి చేస్తున్న తీవ్ర విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడం, ఎన్నికలకు ఇంకా కొంత వ్యవధి ఉన్నందున ఆలోగా టిడిపి చేస్తున్న ఆరోపణలు అవాస్తమని, కేంద్రం ఎపికి అన్యాయం చేయలేదని బిజెపి నిరూపించే ప్రయత్నం చేస్తుందని తెలిసింది.