అందుకే కేంద్రం నివేదికలు అడుగుతోంది...దీన్ని రాజకీయ కోణంతో ముడిపెట్టొద్దు: బీజేపీ నేత విష్ణువర్దన్
గుంటూరు:పాలనలో భాగంగానే రాష్ట్ర అధికారులను కేంద్ర ప్రభుత్వం నివేదికలు అడుగుతోందని...దీనిని రాజకీయ కోణంతో ముడిపెట్టి రాష్ట్రం నష్టపోయేలా చేయొద్దని బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డి ఎపి ప్రభుత్వానికి హితవు పలికారు.
శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఎపిలోని టిడిపి ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల కారణంగానే రాష్ట్రం నష్టపోతోందన్నారు. దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎపి ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని...అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని స్పష్టం చేశారు.
అంతేకాదు సమాఖ్య స్ఫూర్తిని ఎవరైనా గౌరవించాల్సిందేనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకు మినహాయింపు కాదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేతపై కేసులు పెట్టినప్పుడు సీబీఐ మంచిదయిందని...కానీ ఇప్పుడు మాత్రం కాకుండా పోయిందని విష్ణువర్దన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎపికి సీబీఐని వద్దన్నట్లే కోర్టులు, ఐపీఎస్, ఐఏఎస్లను కాదని సొంతంగా పెట్టుకుంటారా?...అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రత్యేక దేశం కాదని...వ్యవస్థలతో ఆడుకోవటం వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని విష్ణువర్థన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి సీఎస్లుగా పనిచేసిన వారు సైతం టీడీపీ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో నయా రాచరిక వ్యవస్థను తయారు చేయాలనుకుంటున్నారా? అంటూ ఆయన టిడిపి ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎసిబి ఇకపై ఏపీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు నిర్వహించేందుకు సిద్దమైందన్న వార్తల నేపథ్యంలో బిజెపి నేత విష్ణువర్దన్రెడ్డి ఎపి ప్రభుత్వంపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ మాత్రమే దాడులు నిర్వహిస్తుండగా...ఇటీవలే సిబిఐ దాడులకు ఎపి ప్రభుత్వం అనుమతి ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అసాధారణ చర్యకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది.