బిజెపి ప్రాణం టిడిపిలో: ఆజాద్, కాంగ్రెస్ కోసం అజహర్
నిజామాబాద్/రాజమండ్రి: రాజు ప్రాణం రామచిలుకలో ఉన్నట్లు.. భారతీయ జనతా పార్టీ ప్రాణం తెలుగుదేశం పార్టీలో ఉందని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఎద్దేవా చేశారు. ఆయన నిజామాబాదులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి, బిజెపి, తెరాస పైన విమర్శలు గుప్పించారు.
బిజెపితో జతకట్టిన టిడిపికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ అయితే ధనికుల పార్టీ బిజెపి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి హిందు, ముస్లింలు రెండు కళ్లన్నారు. తెలంగాణ అబివృద్ధి కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు.
2004లో టిడిపి, బిజెపిలకు అధికారం దూరం చేశామని, ఇప్పుడు అదే పరిస్థితి ఉండాలన్నారు. కాంగ్రెసును తెలంగాణలో గెలిపించాలన్నారు. కెసిఆర్కు పాలనలో ఎలాంటి అనుభవం లేదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదును, బెంగళూరును నిలబెట్టిన ఘనత కాంగ్రెసు పార్టీదే అన్నారు.
కాంగ్రెస్నే గెలిపించండి: అజహరుద్దీన్
నవ తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని క్రికెట్ మాజీ సారథి అజారుద్దీన్ కోరారు. నిజామాబాదులో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ, ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలన్నారు. అజహరుద్దీన్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.