ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అగ్రనేత రాం మాధవ్
ఏపీ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది. ఏడాదిలోపుగానే ఈ ఆపరేషన్ను పూర్తి చేయాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాం మాధవ్ ఏపీ పై దృష్టి సారించారని సమాచారం. 2024ఎన్నికల వరకు బీజేపీని ఏపీలో బలోపేతం చెయ్యటం ఎలా అన్న దానిపై రాం మాధవ్ కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వల్లే ఏపీలో బీజేపీ దెబ్బ తినటానికి కారణం అని గుర్తించారు రాం మాధవ్.
జగన్ మదిలో గ్రేటర్ రాయలసీమ: వైసీపీకి కంచుకోటగా మార్చేందుకా : ఏం చేయబోతున్నారు..!
ఏపీలో బీజేపీకి నష్టం జరిగింది ప్రత్యేక హోదా వల్లే అన్న రాం మాధవ్
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు విజయం సాధించింది టీడీపీ . ఇక 2019 ఎన్నికలకు ఏడాది ముందే ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకొంది. చంద్రబాబు బీజేపీని టార్గెట్ చేసి ప్రచారం చేశారు. ఆ ప్రచారం వల్ల కూడా బీజేపీ దెబ్బ తింది అని వ్యాఖ్యానించారు రాం మాధవ్. ఇక ఏపీలో అసలు పంచాయితీ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే తాము ఏపీలో నష్టపోయామని స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వల్లఎపీలోనే కాదు తెలంగాణాలోనూ నష్టపోయామన్న బీజేపీ నేత రాం మాధవ్
ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల తాము ఆంధ్రాలోనే కాదని తెలంగాణలో కూడా నష్టపోయామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తాము గెలిచిన నాలుగు స్థానాల్లో సెటిలర్స్ ఓట్లు బీజేపీకి పడలేదన్నారు. సెటిలర్స్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుంటున్నారని, ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే బీజేపీకి దూరమయ్యారని ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లాయని చెప్పారు రాం మాధవ్ .ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ మోసం చేసిందని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.
చంద్రబాబు దుష్ప్రచారం ... జగన్ మోడీతో ప్రత్యేక హోదా పై చర్చ ..పునః పరిశీలించే ఆలోచనలో బీజేపీ
ఇక చంద్రబాబు నాయుడు రాజకీయ దురుద్దేశంతో తమపై దుష్ప్రచారం చేశారని ఫలితంగా తమకు కాస్త ఇబ్బంది కలిగించిందన్నారు.కానీ టీడీపీ ఏపీలో నామరూపాలు లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఇదే చంద్రబాబు ఏపీకీ కేంద్రం చేస్తున్న ఆర్థిక సహాయాన్ని అసెంబ్లీ సాక్షిగా పొగిడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పిన రాం మాధవ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ప్రత్యేక హోదాపై చర్చించారని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ప్రధాని దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సలహాల మేరకు ఆనాడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. రాం మాధవ్ చెప్తున్న అంశాలను బట్టి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని పునః పరిశీలించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.