పార్లమెంట్ లో కేశినేని నానీకి కీలక పదవి ...అందరికీ షాక్ ఇచ్చిన బీజేపీ స్ట్రాటజీ ఇదేనా
కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ వ్యూహాలు అర్ధం చేసుకోవటం తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు కష్టంగానే ఉంది. తనకు అనువు గానీ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పక్కా వ్యూహాలను అమలు చేస్తున్న బీజేపీ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించింది అన్న విషయం తెలిసిందే . అందులోనూ ఏపీలో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం నిజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు. ఇక తాజాగా కేశినేని నానీకి కీలక పదవినిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది.
పార్లమెంటు అంచనాల కమిటీ సభ్యుడిగా నానీని ఎంపిక చేసిన బీజేపీ.. అందరికీ షాక్
తాజా ఎన్నికలకు ముందు తమతో స్నేహాన్ని తెంచుకుని, విమర్శలు చేసి ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టీడీపీని మరింతగా బలహీనం చేసే పనిలో ఉంది బీజేపీ . ఈ క్రమంలో బీజేపీ అనుసరిస్తున్నవ్యూహం అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీనే కాకుండా సొంత పార్టీ నేతలకు కూడా అర్ధం కావటం లేదు . అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు షాకింగేనని చెప్పక తప్పదు. అలాంటి వ్యూహాల్లో భాగంగా టీడీపీ సీనియర్ నేత - విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని)ని పార్లమెంటు అంచనాల కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసిన బీజేపీ నిజంగానే అందరికీ ఓ గట్టి షాకిచ్చిందనే చెప్పాలి. ఎందుకు కేశినేని నానీకి బీజేపీ ఈ పదవి కట్టబెట్టింది అనేది మాత్రం ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న ప్రశ్న .
కాషాయ కండువా కప్పుకున్న వారికి కూడా నో చాన్స్ .. కేశినేని నానీకే ఎందుకో ?
ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు చంద్రబాబుకు ఝలక్కిచ్చి కమలం గూటికి చేరిపోయారు. వారిలో సుజనా చౌదరితో పాటు సీఎం రమేశ్ - గరికపాటి మోహన్ రావు - టీజీ వెంకటేశ్ లు ఉన్నారు. ఇక కాషాయ కండువా కప్పుకున్నా వీరిలో ఇప్పటిదాకా ఏ ఒక్కరికి కూడా పెద్దగా పదవులేమీ ఇవ్వని బీజేపీ ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్న నానికి అంచనాల కమిటీలో చోటు కల్పించడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో రాజకీయ నాయకులు పరిశీలన చేస్తున్నారు . టీడీపీలోనే ఉన్నా... కేశినేనిని బీజేపీలోని చాలా మందితో సన్నిహిత సంబంధాలున్నాయి. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే బీజేపీ సీనియర్ నేత ,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు కేశినేని నానీ . ఇక ఆయన తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో పెను కలకలమే రేపారు. టీడీపీ టికెట్ పై గెలిచినా నాని మాత్రం బీజేపీలో చేరిపోతారని ప్రచారం జరిగింది . అయితే బీజేపీలో చేరేది లేదని ప్రకటించిన నాని తాను టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు.
సొంత పార్టీపై అసంహనంతో ఉన్న నానీ .. నానీకి ఆ పదవి వెనుక బీజేపీ స్ట్రాటజీ ఇదేనా
ట్విట్టర్ వేదికగా ట్వీట్లు పెడుతున్న నాని టీడీపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలకు షాకుల మీద షాకులిస్తున్నారు. పార్టీ తరఫున తనతో పాటు విజయం సాధించిన మరో ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్ - కింజరాపు రామ్మోహన్ నాయుడులకు దక్కినంత ప్రాధాన్యం తనకు దక్కలేదన్న భావన వ్యక్తమయ్యేలా కొన్ని రోజుల పాటు ట్వీట్లు పెట్టిన నాని ఇప్పుడు వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక టీడీపీ పట్ల అసహనంతోనే ఉన్న నానీకి టీడీపీ సరైన గౌరవం ఇవ్వకున్నా బీజేపీ మాత్రం సముచిత స్థానం ఇస్తుంది అన్న సంకేతాలు వెళ్ళటం కోసమే నానిని అంచనాల కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుందా అన్న భావన వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలో సైలెంట్ గా తనపని తాను చేసుకుంటూ పోతున్న బీజేపీ తనకు అనుకూలంగా ఇతర పార్టీల్లో ఉంటున్న నాని లాంటి నేతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం , వారిని తన ట్రాప్ లోకి లాగటమే అన్న భావన కలుగుతుంది .చూస్తుంటే భవిష్యత్తులో టీడీపీకి బీజేపీ గట్టి షాకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.