పురందేశ్వరి పవన్ కళ్యాణ్ భేటీ అందుకేనా...!!
ఏపీ రాజకీయాల్లో మరో నూతన అధ్యాయానికి శ్రీకారం జరగబోతోంది. ఇప్పటివరకు ఒకరంటే ఒకరు ఉప్పు నిప్పు గా వ్యవహరిస్తున్న ఆ రెండు పార్టీల మద్య సయోద్య కుదరబోతోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో లో మిత్రపక్షంగా ఉండి అదికారంలోకి వచ్చిన తర్వాత, కొన్నాళ్లు సఖ్యతగానే మెలిగి ఆ తర్వాత విభేదించుకుంటున్న ఆ రెండు పార్టీల మద్య మళ్లీ స్నేహం చిగురించబోతోంది. ఆంద్ర ప్రదేశ్ లో చంద్రబాబు లాంటి రాజకీయ దురంధురుడిని ఎదుర్కొనాలంటే ఇలాంటి కలయికలు తప్పవని చెప్తున్నాయి ఏపి రాజకీయాలు. ఇంతకీ చెట్టాపట్టాలు వేసుకోబోయే ఆ పార్టీలు ఏవి.. ? మిత్రులుగా ఉండి శత్రువులుగా మారి మళ్లీ మిత్రబంధం కోసం వెంపర్లాడుతున్న ఆ ఇద్దరు ఎవరు...?? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!!
ఏపిలో అన్ని పార్టీల లక్ష్యం చంద్రబాబే...!
ఏపీ లో 2019 సాధారణ ఎన్నికలు రసవత్తరం కానున్నాయి. ఎత్తులు -పైఎత్తులు, వ్యూహాలు-ప్రతివ్యూహాలతో రాజకీయాలు తారా స్థాయికి చేరనున్నాయి. రాజకీయ పరిణామాలు కూడా దేశ ద్రుష్టిని ఆకర్శించే స్ధాయిలో ఉంటాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం వేయకమానదు. ముఖ్యంగా అదికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష పార్టీ పై అదికార పార్టీ పైచేయి సాధించేందుకు చేయని ప్రయత్నం ఉండదు, పన్నని వ్యూహం ఉండదు. ఈ రెండు పార్టీలే కాకుండా బీజేపి, జనసేనలు కూడా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నాయి.
ముఖ్యంగా వైయస్ఆర్ సీపి 2019ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో చంద్రబాబును ఓడించాలని ఇప్పటినుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తన సుదీర్గ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు గళం విప్పినా వారిని మచ్చిక చేసుకుని మరింత ఊతం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపి నేతలు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కొనసాగిస్తూనే చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు వైసీపి నేతలు. వచ్చే ఎన్నికల్లో బాబును ఢీ కొట్టేందుకు ఎవరై సై అంటే వారితో కలిపి నడిచేందుకు పచ్చజెండా ఊపుతున్నారు వైసిపి నాయకులు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కాని., శత్రువులు కాని ఉండరు..
ఇక ఏపిలో చంద్రబాబు పై కయ్యానికి కాలు దువ్వుతున్న మరో పార్టీ బీజెపి. 2014 లో మిత్రధర్మాన్ని పాటించిన ఈ రెండు పార్టీల ప్రయాణం విభజన హామీల అమలు దగ్గర బెడిసికొట్టంది. కేంద్రం అందిస్థానని చెప్పిన సాయాన్ని కూడా అందించకుండా కాలక్షేపం చేయడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. కేంద్రం ప్రవేశ పెట్టిన నాలుగు బడ్జెట్ లలో కూడా ఏపీకి తగిన ప్రాధాన్యత లేకపోవడంతో మోడీ ప్రభుత్వం ఏపికి ఏమీ చేయదనే అభిప్రాయానికి వచ్చి ఆ పార్టీతో దోస్తీ కట్ చేసుకున్నారు చంద్రబాబు.
మొన్నటి వరకు పరోక్షంగా కేంద్ర విధానాలను విమర్శించిన టీడిపి నాయకులు ఇప్పుడు బహిరంగంగానే ఒకరిపై ఒకరు ఆరోపణల పర్వానికి దిగుతున్నారు. అంతే కాకుండా బీజేపి సైద్దాంతికంగా నచ్చిన ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలనే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పార్టీ సీనియర్ నేతలు తెర వెనక రాజకీయం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్ కళ్యణ్ ను మచ్చిక చేసుకునేందుకు బీజేపి ప్రయత్నాలు.. రంగంలోకి దిగిన సీనియర్లు..
2019లో చంద్రబాబును ఢీ కొట్టి అదికారం లోకి రావాలని చూస్తున్న వైసీపి ప్రయత్నాలకు ధీటుగా బీజెపి కూడా క్షేత్ర స్థాయిలో అదే పని చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పాత మిత్రులకు కొత్త ఆహ్వానాలు పంపాలని ప్రణాళికలు రచిస్తోంది. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను మళ్లీ మచ్చిక చేసుకోవాలని బీజేపి భావిస్తోంది. గతంలో పనిచేసిన మాదిరిగానే 2019 లో కూడా పని చేసి చంద్రబాబుకు చెక్ పెట్టాలని బీజెపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఫాక్టర్ బాగా పని చేసి ఉభయగోదావరి జిల్లాల్లో పరిపూర్ణ మద్దత్తు కూడ గట్టుకున్నట్టే ఈ సారి కూడా అదే పని చేయాలని బీజెపి పవన్ కు దగ్గరవ్వాలని చూస్తోంది.
పవన్ కళ్యాణ్ చంద్రబాబును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కు తమ తరుపున స్వేచ్చ కలిగించి గతంలో ఇచ్చిన హామీలను 2019లో అదికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేద్దామనే సంకేతాలను ఇప్పించాలని బీజెపి ప్రయత్నిస్తోంది. ఈ నేదద్యంలోనే పార్టీ సీనియర్ నేత పురందేశ్వరి వచ్చే వారంలో పవన్ తో భేటీ కాబోతున్నారు. ఉత్తరాంద్ర పోరాట యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ ను బీజెపి కీలక నేత సంప్రదించడం వెనక మంచి రాజకీయ వ్యూహం దాగుందనే చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ ఏ గట్టున ఉంటాడు...
ప్రజాపోరాట యాత్రలో ఇటు టీడిపి ప్రభుత్వాన్ని, అటు కేంద్ర బీజేపి ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపి తన మందుంచబోతున్న ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తారా..? 2014 ఎన్నికల్లో టీడిపి, బీజేపికి ఓటెయ్యమని ఏపి ప్రజలకు విజ్ఞప్తి చేసి తప్పుచేసానని చెప్పుకొస్తున్న పవన్ తన మనసును అంత తేలిగ్గా మార్చుకుంటారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. పురందేశ్వరి సమావేశం తర్వాత వపన్ వైఖరిలో మార్పు వచ్చి బీజేపికి ప్రజలు మద్దత్తు ఇవ్వాలని కోరుతారా..? 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పిన పవన్ అన్ని స్థానాల్లో జనసేనతో పాటు బీజేపిని బలపరచాలని పిలుపునిస్తారా... ? పురందేశ్వరి భేటి తర్వాత మరో కేంద్ర మంత్రి, పవన్ కి మంచి మిత్రుడు ప్రకాశ్ జావదేకర్ కూడా జనసేనాని తో సమావేశం అయ్యేందకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఓ పక్క చంద్రబాబు వ్యతిరేక శక్తుల పునరేకీకరణ కోసం వైసీపి చురుగ్గా పనిచేస్తుండగా మరో వైపు కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని చంద్రబాబు పై యుద్దం చేసేందుకు బీజేపి పావులు కదుపుతోంది. జాతీయ స్థాయిలో బీజేపి చేస్తున్న ప్రయత్నాలకు జనసేనాని ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.