మూడు రాజధానుల్లో కేంద్రం పాత్ర పరిమితమే- కానీ అవినీతిని ప్రశ్నిస్తాం- రామ్ మాధవ్ కామెంట్స్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మూడు రాజధానులపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాథవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ ఛీఫ్గా సోము వీర్రాజు పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం పాత్ర, రాష్ట్రంలో బీజేపీ పోషించాల్సిన పాత్ర వంటి అంశాలపై నేతలకు హితబోధ చేశారు. ఏపీ విభజన తర్వాత జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూనే ప్రస్తుతం బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరాన్ని రామ్ మాధవ్ మరోసారి గుర్తుచేశారు.
అమరావతి ఏర్పాటులో చంద్రబాబు పాత్ర..
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం చర్చనీయాంశం అవుతున్న వేళ బీజేపీ నేత రామ్ మాథవ్ దీని నేపథ్యంతో పాటు గతంలో జరిగిన పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజధాని ఎంపిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించిందని, రాజధాని నిర్మాణం జరిగే లోపు హైదారాబాద్ ను పదేళ్లు పాటు ఉమ్మడి రాజధానిగా కూడా ఉంచిందని, కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి ఎందుకు పారిపోయి వచ్చిందో తెలుసంటూ టీడీపీకి చురకలు అంటించారు. ఇక్కడ అద్దె భవనాల్లో పనిచేసినా, బస్సుల్లో నుంచే పాలన నడిపినా కేంద్రం జోక్యం చేసుకోలేదని, అమరావతి రాజధానికీ కేంద్రం అడ్డు చెప్పలేదని, ఇంకా నిధులు కూడా ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా కేంద్రం జోక్యం చేసుకోలేదని రామ్ మాధవ్ గుర్తుచేశారు.
అప్పటికీ, ఇప్పటికీ బీజేపీ మారలేదు..
గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినా కేంద్రం జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్నా జోక్యం చేసుకోవడం లేదని రామ్ మాధవ్ వెల్లడించారు. ఇప్పటికే వైసీపీ మూడు రాజధానుల్లో కేంద్రం పాత్ర ఉండబోదని హైకోర్టుకు కౌంటర్ ఇచ్చిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా కొత్త రాజధానుల ఏర్పాటులో కేంద్రం పాత్ర పరిమితంగానే ఉండబోతోందంటూ రామ్ మాధవ్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. కానీ కొందరు ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్నీ ఈ విషయంలో ఇరికించాలని చూస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి చురకలు అంటించారు. మోడీ భుజంపై తుపాకీ పెట్టి ఎవరినో కాల్చాలని చూస్తే కుదరదని స్పష్టం చేశారు.
మూడు రాజధానులనూ ప్రశ్నిస్తాం...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో కేంద్రం జోక్యం ఉండబోదంటే బీజేపీ ప్రశ్నించబోదని కాదని రామ్ మాధవ్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై ఎవరూ ప్రశ్నించకూడదని అనుకోవడం సరికాదన్నారు. ప్రపంచంలో, భారత్ లో ఎక్కడా లేనట్లుగా మూడు రాజధానులు కడతామంటే దాన్ని ఔచిత్యం ఎవరూ ప్రశ్నించకూడదని కాదన్నారు. అంత పెద్ద రాష్ట్రం యూపీకే లక్నో ఓ రాజధానిగా ఉందని, ఇక్కడ మూడు రాజధానుల విషయంలోనూ ప్రశ్నలు వస్తాయన్నారు. అవినీతి జరిగింది కాబట్టి అమరావతి నుంచి రాజధాని మార్చాలనుకుంటే అప్పట్లో దాని అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాడిందే ఇప్పుడు అలా జరిగినా బీజేపీ పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు అవినీతికి ఆలవాలంగా మారకుండా, అమరావతిలో రైతుల నష్టాన్ని పూరించే విధంగా బీజేపీ క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉందని రామ్ మాథవ్ బీజేపీ శ్రేణులకు తెలిపారు.
కాలానుగుణంగా బీజేపీ మారాల్సిందే..
రాష్ట్రంలో ప్రస్తుతం బలమైన ప్రతిపక్ష గొంతుక లేదని, దాన్ని నిర్మించాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని రామ్ మాధవ్ గుర్తుచేశారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదగాలని, అధికారంలోకి రావాలంటే వచ్చేనాలుగేళ్లు బీజేపీ కార్యకర్తలు చాలా కష్టపడాలన్నారు. అందుకు అవకాసం కూడా ఉందని, విపక్ష వైఖరిని కూడా దీటుగా ఎదుర్కోవాలని రామ్ మాథవ్ సూచించారు. రాజకీయాలు పూల
అధికారంలో ఉన్నవాళ్లు గూండాయిజానికి దిగితే దాన్ని బీజేపీ దీటుగా ఎదుర్కోవాలని కోరారు. బీజేపీ సంఘర్ష పథంలో వెళ్లి రాష్ట్ర ప్రజల కోసంబలమైన శక్తిగా ఎదగాలన్నారు. రాష్ట్రంలో గతంలో బీజేపీ జూనియర్ భాగస్వామి మనస్తత్వంతో ఉండిపోయిందని, ఇప్పుడు బీజేపీ బలమైన శక్తిగా మారాల్సిన అవసరముందన్నారు. వీధి పోరాటాలు చేసే స్ధాయికి ఎదగాలని, ఇతర పార్టీల భుజాల మీద చేతులు వేసుకుని వెళ్లడం కాదు, ప్రజల కోసం నిలబడి పోరాడాలని సూచించారు.
అధికారమే లక్ష్యమన్న సోము...
బీజేపీని వచ్చే నాలుగేళ్లలో అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు తెలిపారు. బీజేపీది ఎప్పుడూ ఒకటే మాట, ఒకటే సిద్ధాంతమన్నారు. పోలవరంతో పాటు అన్ని అంశాల్లోనూ రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తుందని సోము తెలిపారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, ఇతర పార్టీలు మాత్రం తెలంగాణలో విభజన వాదం, ఏపీలో సమైక్య వాదం పేరుతో మోసం చేశాయని సోము పేర్కొన్నారు. ఏపీలో కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సోము డిమాండ్ చేశారు.