కర్ణాటకలో గెలుపు కోసం రూ.10,500 కోట్లు బిజెపి ఖర్చు..సిఎంఎస్ సర్వే:మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు:కర్ణాటక ఎన్నికల ఫలితాలపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బిజెపి విజయం స్చచ్ఛమైనది కాదున్నారు. ఇవి అసలు ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలు కావన్నారు.
ఆ రాష్ట్రంలో 222 సీట్ల కోసం బిజెపి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికల కోసం బిజెపి రూ.10,500 కోట్లు ఖర్చుపెట్టిందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంఎస్) సర్వే తేల్చిందని సోమిరెడ్డి చెప్పారు. 130 కోట్ల మంది ప్రజలు బీజేపీకి దేశాన్ని పాలించే అధికారం ఇస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఆర్ఎస్సెస్ ప్రతినిధులు అందరూ కర్ణాటకలో తిష్ట వేసి ప్రాణాలొడ్డారని అన్నారు.
బిజెపి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీని ఫినిష్ చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మొన్నత్రిపుర ఎన్నికల సందర్భంగా వేల కోట్లు ఖర్చుపెట్టిన బిజెపి ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే రాజకీయం చేసిందన్నారు. మిగిలిన పార్టీలకు ఎవరైనా ఆర్థికసాయం చేస్తే ఐటీ దాడులు చేయించి బెదరగొట్టిన నైజం బీజేపీదని, ఇంత చేసినా కర్ణాటక ప్రజలు బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదని విమర్శించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ కి వచ్చిన ఓట్లతో పోలిస్తే బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కూడా తక్కువేనన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగింది ఒక్క కర్ణాటకలోనే నని, కానీ 2019లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని..అప్పుడు బీజేపీ ఆటలు సాగవని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. మోదీ, అమిత్ షాల వైఖరిని దేశప్రజలందరూ గమనిస్తున్నారని...తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యనించారు.
మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో బిజెపి గెలుపు విషయమై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. కర్ణాటకలో సంఖ్య పరంగా బీజేపీ గెలిచినా ఓట్ల పరంగా బీజేపీది ఓటమేనన్నారు. అక్కడ 60 శాతానికి పైగా ప్రజలు బీజేపీని వ్యతిరేకించారని చెప్పారు. ఇక బిజెపి ఆరోపిస్తున్న విధంగా కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ ఎక్కడా ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ మోడీ నియంతృత్వ విధానాల పట్ల కర్ణాటక ప్రజలు విసిగిపోయారని చెప్పారు. అయితే బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో కర్ణాటకలోని బీజేపీయేతర పార్టీలు విఫలం అయ్యాయని విశ్లేషించారు.
అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 36 శాతం మాత్రమేనని, ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్లే కర్ణాటకలో బీజేపీకి ఓట్ల శాతం పెరగలేదనేది గమనించాలన్నారు. రాజకీయాల్లో ఓట్లు తక్కువగా వచ్చినా సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కర్ణాటకలో అదే జరిగిందని, అక్కడ బీజేపీది కేవలం సాంకేతిక విజయం మాత్రమేనని చెప్పారు. 2019లోనూ ఇదే రిపీట్ అవుతుందని బీజేపీ అనుకుంటే పొరపాటేనని, తమకున్నసమాచారం మేరకు తెలుగువాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారని, ఏదేమైనా కర్నాటక ఎన్నికల ఫలితాలను మరింత విశ్లేషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.