ఏపీలో బిజెపిలో రెండు వర్గాలు, గవర్నర్పై ఫిర్యాదు వెనుక బాబే: సి. రామచంద్రయ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి రెండు వర్గాలుగా చీలిపోయిందని ఏపీ కాంగ్రెస్ పార్టీ నేత సి. రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉన్నారని రామచంద్రయ్య ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను ఆ పదవి నుండి తప్పించాలని బిజెపి ఇటీవల కాలంలో డిమాండ్ చేసింది.అంతేకాదు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విశాఖపట్టణం ఎంపీ హరిబాబు ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు లేఖ కూడ రాశారు.
ఏపీ రాష్ట్రం పై గవర్నర్ నరసింహన్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపణలు గుప్పించారు. గవర్నర్ నరస్ంహన్ ను తప్పించి ఆయన స్థానంలో మరోకరిని గవర్నర్గా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నేత సి. రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
గవర్నర్ విషయమై బాబు లేఖ రాయించారు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ తనకు అనుకూలంగా ఉన్న వర్గంతో చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాయించారని కాంగ్రెస్ పార్టీ నేత సీ. రామచంద్రయ్య ఆరోపించారు. ఏపీ రాష్ట్రంలో బిజెపి రెండు వర్గాలుగా చీలిపోయిందని రామచంద్రయ్య ఆరోపించారు. చంద్రబాబు అక్కమాల గురించి కేంద్రానికి నరసింహన్ వివరించారని, దీంతో గవర్నర్కు వ్యతిరేకంగా బాబు లేఖ రాయించారని రామచంద్రయ్య ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు
స్వంత ప్రయోజనాలను చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రామచంద్రయ్య ఆరోపించారు.ఓటుకు నోటు కేసులో ఇరుక్కొన్నందునే బాబు కేంద్రానికి భయపడుతున్నాడని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు.
పోలవరం ప్రాజెక్టుకు బాబే అడ్డు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాకుండా చంద్రబాబునాయుడే అడ్డుపడుతున్నారని రామచంద్రయ్య ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి బాబు అనుసరిస్తున్న విధానాలే కారణమని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో బాబు తగిన చర్యలు తీసుకోవడం లేదని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు.
తన వర్గం నేతలతో బాబు లాబీయింగ్
ఏపీలోని బిజెపిలో తన వర్గం నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లాబీయింగ్ చేస్తూ తన పనులను తాను చేయించుకొంటుపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ నేత రామచంద్రయ్య ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే బిజెపి రాష్ట్ర శాఖ రెండు వర్గాలుగా చీలిపోయిందని రామచంద్రయ్య ఆరోపించారు. తనకు అనుకూలంగా ఉన్న వర్గంతో తనకు కావాల్సిన పనులను బాబు చేయించుకొంటున్నారని రామచంద్రయ్య విమర్శించారు.