కొత్త పల్లవి అందుకున్న ఏపీ బీజేపీ ! చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేసారని అనుమానం !
Recommended Video
కొద్ది రోజులుగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మోదీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చేస్తుందంటూ విమర్శిస్తున్నారు. ఇవియంల పని తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఏపి బిజెపి నేతలు రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇవియంలను మేనేజ్ చేసారనే అనుమానాలను వ్యక్తం చేసారు. ఇందు కోసం కొంత మంది కలెక్టర్లు సహకరించారని బిజెపి నేతలు అనుమానిస్తున్నారు.
ఇవియంల తీరు పై బాబు ఉద్యమం..
ఏపిలో పోలింగ్ ప్రారంభమైన సమయంల నుండి నేటి వరకు ఏపితో పాటుగా అనేక ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ప్రదానంగా ఎన్నికల సంఘాన్ని..ఇవిఎంల పనితీరు పైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదని వాదిస్తున్నారు. ప్రధాని మోదీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చేస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏపిలో ఇవియంలు మొరాయించటం.. అర్దరాత్రి వరకు పోలింగ్ జరగటం వంటి వాటి పైన ఇప్పటికీ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, యుపిఏ భాగస్వామ్య పార్టీలకు మద్దతుగా ప్రచారానికి వెళ్లిన ప్రాంతాల్లోనూ చంద్రబాబు ఇవే విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికల కౌంటింగ్లో 50 శాతం వివిప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం న్యాయ పోరాటం సైతం కొనసాగిస్తామని చెబుతున్నారు.
చంద్రబాబు మీదే అనుమానం..
సడన్ గా ఏపి బిజెపి నేతలు రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు. ఏపిలో కొందరు కలెక్టర్ల సహకారంతో చంద్రబాబు ఇవియంలను మేనేజ్ చేసారనే అనుమానం కలుగుతోందని ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తమకు ఇవియంల పైన నమ్మకం ఉందంటూనే..చంద్రబాబు మీద మాత్రం లేదంటున్నారు. ఆయన తీరు గతంలోనూ..ఇప్పుడూ దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉందని విమర్శించారు. ఏపిలో ఎన్నికలు జరిగిన తీరు పూన కేంద్రం ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి సమీక్షించాలని కోరారు. ఈవీఎంలను మేనేజ్ చేశారన్న అనుమానాలు మాకు ఇప్పుడు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని..మోదీని కలిపి విమర్శలు చేస్తుంటే..ఇప్పుడు బిజెపి చేస్తున్న ప్రతివిమర్శలు ఇది రాజకీయంగా చేస్తున్న ఆరోపణలా లేక ఏమైనా అనుమానం వచ్చిందా అనే చర్చ మొదలైంది.
అఖిలపక్ష భేటీలోనూ ఆరోపణలు
ముంబాయిలో జరిగిన బీజేపీతర పక్షాల సమావేశాలోనూ ఇవియంల పైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇవియంలను హాక్ చేసే అంశం పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక వైపు ఏపిలో ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమైన పరిస్థితుల్లో చంద్రబాబు ఇవియంల పైన రాద్దాంతం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టిడిపి నేతలు మాత్రం తాము గెలవటం ఖాయమని..తాము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. వైసిపి సైతం చంద్రబాబు ఆరోపణలను తప్పు బడుతోంది. ఇప్పుడు సడన్గా బిజెపి నేతలు చంద్రబాబు పైన మొదలు పెట్టిన విమర్శలు ఎటువంటి చర్చకు కారణమవుతాయో చూడాలి.