ఆట మొదలైంది: టీడీపీ కంచుకోటకు బీటలు: అనంత టీడీపీ నేతల జంప్..!!..ఆపగలరా..!
ఏపీలో అధికారం మారంది. అసలైన రాజకీయం మొదలైంది. టీడీపీ కంచుకోటలే లక్ష్యంగా ఆపరేషన్ ప్రారంభమైంది. రాయలసీమలో తాజా ఎన్నికల్లో దెబ్బ తిన్న టీడీపీ..ఒక కోలుకోవటానికి వీలు లేకుండా దెబ్బ తీయాలని ఇటు వైసీపీ.. అటు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులో భాగంగా..ఫలితాల షాక్ నుండి తేరుకోకముందే టీడీపీ అధినాయక త్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టాలని యోచిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా టీడీపీ కంచుకోట అయిన అనంతపురం జిల్లాను తొలుత లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడి టీడీపీ కీలక నేతలను పార్టీ నుండి ఆకర్షించే పని ప్రారంభించారు. దీంతో..ఇప్పుడు ఇక అనంతపురంలో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఢిల్లీకి అనంత నేతల క్యూ...
తాజా ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో వైసీపీ 12 స్థానాలు గెలుచుకుంది. కేవలం రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలుపొందింది. వర్గ రాజకీయాలు ఎక్కువగా ఉండే అనంత జిల్లాలో చేతిలో అధికారం లేకపోతే ఇబ్బంది అనే భావనతోనే ఇక్కడి రాజకీయ నేతలు ఉంటారు. సరిగ్గా ఇదే కారణాన్ని గుర్తించిన బీజేపీ నేతలు తమ ఆపరేషన్ను ప్రారంభించారు. జిల్లాలో గుర్తింపు ఉన్న టీడీపీ నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. బీజేపీలో రావాలని.. ఇక, ఏపీ లో టీడీపీకి భవిష్యత్ లేదని చెబుతున్నారు. ఇక, ఈ నేతలు సైతం టీడీపీని కాదనుకుంటే..వైసీపీ లోకి వెళ్లే పరిస్థితి లేదు. ప్రతీ నియోజకవర్గంలోనూ రాజకీయంగా ప్రత్యర్ధులు అధికారంలో ఉన్నారు. అదే సమయంలో ..వైసీపలోకి వెళ్లాలంటే మద్దతు దారులు సైతం అంగీకరించే పరిస్థితి ఉండదు. ఇదే సమయంలో..టీడీపీలో కొనసాగితే భవిష్యత్ రాజకీయానికి భరోసా లేదు. దీంతో..అనంత నేతలు సైతం బీజీపీతో టచ్లోకి వెళ్లారు.
కీలక నేతలు బీజేపీలోకే...!
అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం..పరిటాల కుటుంబ అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలతో బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ మంతనాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే, ఇక కుటుంబం చేరే పార్టీలో మరో కుటుంబం చేరుతుందా అంటే..ఇద్దిరినీ ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. తాజా ఎన్నికల్లో రెండు కుటుంబాల వారసులు ఓటమి చవి చూసారు. ఇక, అదే విధంగా జిల్లాలో పుట్టపర్తి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీతో టచ్లో ఉన్నట్లు సమాచారం. టీడీపీ తిరిగి వచ్చే ఎన్నికల నాటికి పుంజు కొనే అవకాశం లేదని..చంద్రబాబు వయస్సు రీత్యా ఆయన గతంలో మాదిరి యాక్టివ్గా భవిష్యత్లో రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. దీంతో..బీజేపీ నుండి వచ్చిన ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని..వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్నారు.
చంద్రబాబు అడ్డుకోగలరా..
టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా నుండి కీలక నేతలు బీజేపీలో చేరితే పార్టీకి తీవ్ర నష్టమే. దీంతో.. వీరిని అడ్డుకోవటం కోసం టీడీపీ అధినాయకత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు రాజకీయంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన చెప్పినా..ఈ నేతలు తమ ప్రయత్నాలు మానుకుంటారా అంటే అది సందేహమే. ఇదే సమయంలో..ఎంతో కాలంగా టీడీపీనే నమ్ముకుని ఉన్న ఈ నేతల అనుచర గణం సైతం బీజేపీలోకి మారేందుకు తమ నేతలకు మద్దతుగా నిలుస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే, నేతలు మాత్రం తమ అనుచరులను తాము ఒప్పిస్తామని చెబుతున్నారు. జేసీ బ్రదర్స్ ఈనెల12న బీజేపీలో చేరటానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ఇతర నేతలు క్యూ కట్టే అవకాశం ఉందని సమాచారం.