టిక్కెట్లపై హామీలేదని వెంకయ్య: కృష్ణంరాజు టి పిటిషన్పై
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వారు ఎవరైనా పార్టీలోకి రావొచ్చునని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు. కేవలం టిక్కెట్ల పైన ఆశలతో మాత్రమే రావొద్దని హితవు పలికారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే రావాలన్నారు.
పార్టీలో చేరే ప్రతి నాయకుడికి ఎన్నికల్లో పోటీ చేసేలా టిక్కెట్ లభిస్తుందనే హామీ ఉండదని చెప్పారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీలో ఓ వ్యవస్థ ఉంటుందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనం ఖాయమన్నారు.
రాష్ట్రం నుండి కూడా తగినన్న పార్లమెంటు స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సాధ్యమైనన్ని స్థానాలను గెలుపొందడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీ శ్రేణులు పెట్టుకోవాలని సూచించారు. బిజెపి తెలంగాణకు మద్దతిస్తుందన్నారు.
మరోవైపు, ఇటీవలే రఘురామ కృష్ణం రాజు భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం లోకసభ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే, ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు విభజనకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉంది. దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. విభజనకు వ్యతిరేకంగా రఘురామ కృష్ణం రాజు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంపై ఆయన్ను వివరణ కోరతామని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినట్లయితే ఆయనకు పార్టీ సభ్యత్వం ఇవ్వొద్దంటూ అధిష్ఠానానికి చెబుతామన్నారు.