పవన్తో పొత్తు..జగన్ తో మైత్రి: జనసేనాని బీజేపీ ట్రాప్ లో చిక్కారా: ఢిల్లీ సమీకరణాలేంటి..?
అమరావతి: ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతల పార్టీల మార్పు స్పీడ్ గా జరిగిపోతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద రాజకీయ దాడి తీవ్రతరం చేసాయి. దీంతో..ఆకస్మికంగా 2014లో కలిసి పోటీ చేసిన టీడీపీ..బీజేపీ..జనసేన..ఇప్పుడు టీడీపీని వదిలేసి మిగిలిన రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. కానీ, ఏపీలో జనసేనతో మినహా ఏ పార్టీతోనూ తెర ముందూ..వెనకా ఎటువంటి పొత్తులు..ఒప్పందాలు లేవని బీజేపీ ముఖ్య నేతలు ప్రకటించారు. కానీ, ఢిల్లీ కేంద్రంగా మాత్రం ఆ పరిస్థితి కనిపించటం లేదు.
జగన్కు బీజేపీ పరోక్షంగా సహకరిస్తోందా..?
బీజేపీ జనసేన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఎక్కడో తేడా కొడుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరాక ప్రకటించిన కార్యాచరణలో ఒక్కటీ అమలు కాలేదు. ఇక, ఇప్పుడు స్థానిక సంస్థల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఫలితాల ఆధారంగా వారి భవిష్యత్ పొత్తు ఆధార పడి ఉంటుంది.
ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కు బీజేపీ నేతలు పరోక్షంగా సహకరిస్తున్నారని..బీజేపీ మాటలను జగన్ సైతం అంగీకరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటు తమతో పాత్తు పెట్టుకొని..వైసీపీతో బీజేపీ చేస్తున్న రాజకీయం జనసైనికులకు రుచించటం లేదు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు వారికి ఇబ్బందిగా మారాయి. దీంతో..ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారు..
పవన్ తో పొత్తు..జగన్ తో మైత్రి..!
ఏపీలో సంక్రాంతి సమయంలో బీజేపీ..జనసేన మధ్య పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని..అమరావతి విషయంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కానీ, అమరావతి విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. రాజధాని మార్పు విషయంలో అమరావతికి అండగా ఉంటానిని..కేంద్ర పెద్దలతో చర్చిస్తానని పవన్ అక్కడి స్థానికులకు హామీ ఇచ్చారు. కానీ, బీజేపీ ఎంపీ జీవీఎల్ ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని..కేంద్రానికి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. ఇక, పవన్ బీజేపీతో పొత్తుకు ముందూ..తరువాత ఢిల్లీ వెళ్లినా అక్కడ కేవలం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ..ఆ తరువాత బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న నడ్డాతో మాత్రమే సమావేశం కాగలిగారు.
పవన్ పదే పదే చెప్పినట్లుగా అమిత్ షా..ప్రధాని అప్పాయింట్ మెంట్లు మాత్రం ఖరారు కాలేదు. ఏపీలో మిత్రపక్ష పార్టీకి చెందిన అధినేతకు వారిద్దరి అప్పాయింట్ మెంట్ ఎందుకు దొరకలేదనే దానికి జనసేన నుండి అదే విధంగా బీజేపీ నుండి స్పష్టత లేదు. ఇక, ఇదే సమయంలో సీఎం జగన్ కు మూడు నెలల తరువాత ప్రధాని..అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించింది. అది రాజకీయం కాదని..సీఎం..ప్రధాని హోదాలో జరిగిన సమావేశంగా చెప్పుకొచ్చారు.
బీజేపీ సూచనతో అంబానీ మిత్రుడికి రాజ్యసభ సభ్యత్వం
ఇక, ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ..ప్రభుత్వ - రాజకీయంగా అంబానీ వ్యవహారాలు చక్కబెట్టే పరిమళ్ నత్వానీకి వైసీపీ నుండి రాజ్యసభ సీటు కోసం అమిత్ షా సూచనల మేరకే నేరుగా ముఖేష్ అంబానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వచ్చారు. అమిత్ షా సూచన..అంబానీ స్వయంగా వచ్చి కోరటంతో నత్వానీకి సీఎం జగన్ రాజ్యసభ సీటు ఖాయం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో బీజేపీ .. జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వం మీద పోరాడుతున్న సమయంలో జగన్ వద్దకు అంబానీ లాంటి ప్రముఖులను పంపటం..రాజ్యసభ కోరటం ద్వారా జగన్ విలువ ఆమాంతం జాతీయ స్థాయిలో పెంచే విధంగా బీజేపీ వ్యవహరించిందనే అభిప్రాయం జనసేనలో వినిపిస్తోంది.
ఇదే సమయంలో బీజేపీ పెద్దల జోక్యం లేకుండా విజయనగరంలో మన్సాన్ ట్రస్ట్..సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా సంచైతకు ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఉత్తర్వులు ఇవ్వటం సాధ్యపడదని జనసేనలో కొందరు నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
టీడీపీకి దగ్గక కాకుండానే..ట్రాప్ చేసారా
బీజేపీకి ఇప్పుడు ఏపీలో టీడీపీ మాత్రమే రాజకీయంగా ప్రధానంగా ప్రత్యర్ధిగా కనిపిస్తోంది. టీడీపీని రాజకీయంగా దెబ్బ తీయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధినాయకత్వం..తిరిగి టీడీపీ ఎంత ప్రయత్నించినా వారితో తిరిగి మైత్రికి మాత్రం ససేమిరా అంటున్నారు. ఇదే సమయంలో ఏపీలో టీడీపీని ఒంటరి చేసే ఉద్దేశంతోనే జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ..వ్యూహాత్మకంగా కొందరిని రంగంలోకి దింపి అనూహ్యం గా ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుంది. అదే సమయంలో వైసీపీ పట్ల పూర్తి వ్యతిరేకతతో బీజేపీ లేదు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఏపీలో ఎదగాలని..టీడీపీ ఇప్పట్లో కోలుకొనే పరిస్థితి లేదని అంచనా వేస్తున్న బీజేపీ పవన్ సహకారం ఉంటే మరింతగా బలోపేతం అవుతామని భావిస్తోంది.
కానీ, రాజ్యసభలో వైసీపీ సభ్యుల మద్దతు అవసరం కావటంతో..వైసీపీతోనూ పరోక్షంగా మైత్రి కొనసాగిస్తోంది. పాలనా పరంగా..ఇతరత్రా కారణాలతో వైసీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు అవసరమే. దీంతో..అటు బీజేపీ..ఇటు వైసీపీ రాజకీయ ఎత్తుగడల నడుమ జనసేన ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటితేనే అటు బీజేపీ వద్ద..ఇటు ఏపీలోనూ రాజకీయంగా తమ స్థానం సుస్థిరం చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.