టిడిపిని దెబ్బతీసేందుకు బిజెపి రెడీ:కౌంటర్ ఇచ్చేందుకు తెదేపా ఢీ!
అమరావతి:ఏపీలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు భారతీయ పార్టీని తన వ్యూహానికి పదును పెడుతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం సాయంతో నడుస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ తమ పథకాలుగా ప్రచారం చేస్తోందని బీజేపీ ఇటీవలి కాలంలో ఆరోపణలు ముమ్మరం చేసింది.
Recommended Video
అంతటితో సరిపెట్టుకోకుండా తమకు క్రెడిట్ దక్కకుండా టిడిపి చేస్తున్న అన్యాయానికి తగిన బుద్ది చెప్పాలని బిజెపి భావిస్తోందట. ఆ క్రమంలోనే ఏ కేంద్ర పథకాలనైతే టిడిపి వారి పేరిట ప్రచారం చేసుకుంటోందో ఆయా శాఖల మంత్రులను రాష్ట్రంలో పర్యటించేలా చేసి తద్వారా ఆ పధకాలపై బీజేపీ ముద్ర తెలిసేలా ఆ పార్టీ వ్యూహం సిద్దం చేస్తోందట. అయితే ఈ విషయం కనిపెట్టిన టిడిపి దానిక్కూడా కౌంటర్ ఇచ్చేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలిసింది.
కేంద్ర పథకాలు...రాష్ట్ర ప్రచారం
కేంద్ర ప్రాయోజిత పధకాలు, ఇతర అభివృద్ది కార్యక్రమాలను ఎపి ప్రభుత్వం తమ పధకాలుగా ముద్ర వేసి ప్రచారం చేసుకుంటుందని బీజేపీ నేతలు చాలాకాలంగా ఆరోపిస్తున్నా ఇటీవలి కాలంలో ఆ ఆరోపణలను మరింత ఉధృతం చేశారు. పోలవరానికి వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేస్తున్నా ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతి సోమవారం సమీక్షిస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందనే ప్రచారాన్ని తెలుగుదేశం ప్రజల్లోకి తీసుకువెళ్లిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు వల్లే ప్రాజెక్టు నిర్మాణం పరుగులు తీస్తోందని టీడీపీ నేతలు ప్రతిరోజూ చెబుతున్నారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక విద్యాసంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీ, యన్.ఐ.టి. ఐఐటీ, ఐఐఎం,అయిజర్ వంటి అనేక సంస్థలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ఏర్పాటు క్రెడిట్ తమకు ఏమాత్రం దక్కడం లేదనేది బీజేపీ నేతల ఆవేదనగా తెలుస్తోంది.
కన్నాకు కూడా...మెయిన్ టాస్క్ అదే...
ఇటీవలే ఏపీ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కన్నా లక్ష్మీనారాయణకు కూడా ఈ కేంద్ర అభివృద్ది పథకాల క్రెడిట్ తిరిగి దక్కించుకోవడమే ప్రధాన టాస్క్ గా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ కీలక నేతల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సాయంతో నడిచే ప్రాజెక్టుల వద్దకు సంబంధిత మంత్రులు వెళ్లి పురోగతిని సమీక్షించడంతో పాటు, ఈ పధకాలపై తమ ముద్ర వేసుకోవాలని నిర్ణయించడం జరిగిందట. ఈ ఆలోచనలో భాగంగానే కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పది నెలల తర్వాత పోలవరం వచ్చి ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని సమీక్షించారని అంటున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి వెళ్లాలా,వద్దా అనే అంశంపై టిడిపిలో మల్లగుల్లాలు పడినా చివరకు చంద్రబాబు వెళ్లారు.
గడ్కరీ రాక...మరి కొందరు కూడా!
ఈ క్రమంలోనే గడ్కరీ రాక సందర్భంగా బీజేపీ నేతలు ఫుల్లు గా హడావుడి చేశారు. అలాగే ప్రతి నెలా నలుగైదుగురు కేంద్ర మంత్రులను రాష్ట్రానికి తీసుకువచ్చి కేంద్రం నిధులిస్తున్న పధకాల గురించి ప్రచారం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారని సమాచారం . అదే కోవలో ఈనెల 13వ తేదీన మంగళగిరికి సమీపంలో నిర్మిస్తున్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ ఆసుపత్రి నిర్మాణ పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపీ నడ్డాను విజయవాడ తీసుకువస్తున్నారట. ఢిల్లీ నుంచి వస్తున్న నడ్డా నేరుగా మంగళగిరి వెళ్లి ఎయిమ్స్ నిర్మాణ పురోగతిని అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఎయిమ్స్ నిర్మాణ పురోగతి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం, విభజన చట్టంలో కేంద్రం ఎయిమ్స్ నిర్మిస్తామని ఇచ్చిన హామీని ప్రజలకు గుర్తు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఎయిమ్స్ వద్దనే నడ్డా కేంద్ర ప్రాయోజిత పధకాలు, రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరుపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించి స్వయంగా ఆయనే మీడియాకు ఆ వివరాలన్నింటినీ వెల్లడిస్తారట.
బిజెపి ఢీ...టిడిపి రెఢీ
అలాగే కేంద్ర విద్యా సంస్థలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసి ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభించిన సందర్భంగా వీటి నిర్మాణానికి కేటాయిస్తున్న నిధులపై రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఈనెల చివరిలో కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా రాష్ట్రానికి వస్తారట. బీజేపీ నేతలు ఈ విధంగా కేంద్ర మంత్రులను వరుసగా రాష్ట్రానికి తీసుకువస్తుండటంతో టిడిపి కూడా అలెర్ట్ అయింది. అందుకే కేంద్ర మంత్రుల ప్రెస్ మీట్లకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్కు అత్యంత విలువైన సుమారు వంద ఎకరాల స్థలం ఇచ్చిన విషయం నీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్న అంశాలను కూడా అదే సమయంలో రాష్ట్ర మంత్రులు కూడా ప్రజలకు వివరిస్తారట. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తే సంబంధిత రాష్ట్ర మంత్రులను కూడా వారి వెంట పంపాలని టిడిపి నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగనిచ్చేది లేదని, ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఇచ్చిన మిగతా హామీలను నెరవేర్చకుండా ఎవరు వచ్చి ఏం చేసినా ఉపయోగం ఉండదని టీడీపీ నేతలు అంటున్నారట.